
- మార్స్పై రాయిని డ్రిల్ చేసినా.. శాంపిల్ తీయలే!
వాషింగ్టన్: అంగారక గ్రహంపై అన్వేషణ చేస్తున్న నాసా పర్సివరెన్స్ రోవర్ అక్కడ ఓ రాయిని డ్రిల్ చేసింది. అయితే రాతి శాంపిల్స్ ను మాత్రం తన ట్యూబ్లోకి తీసుకోలేకపోయింది. మార్స్ పై జెజెరో క్రేటర్లో రోవర్ తవ్విన రంధ్రానికి సంబంధించిన ఫొటోను అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా శుక్రవారం విడుదల చేసింది. అన్ని పరికరాలు అనుకున్నట్టే పని చేశాయని, శాంపిల్స్ మాత్రం సేకరించలేకపోయినట్లు తెలిపింది. ‘ఇది మేము ఆశించిన రిజల్ట్ కాదు. అయితే కొత్త ప్రాంతాల్లో జరిగే ప్రయోగాల్లో ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది’ అని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ అన్నారు. త్వరలో కచ్చితంగా శాంపిల్స్ సేకరిస్తామని చెప్పారు. డ్రిల్లింగ్ చేయడమనేది మార్స్ ఉపరితలం నుంచి నమూనాల సేకరించడంలో తొలి దశ అని, దీనికి11 రోజుల టైమ్ పడుతుందన్నారు.
టార్గెట్.. 30 శాంపిల్స్
పెద్ద కారు అంత ఉన్న పర్సివరెన్స్ ఫిబ్రవరి18న మార్స్ పై జెజెరో క్రేటర్లో దిగింది. ఈ లోయలో 350 కోట్ల ఏండ్ల కిందట భారీ సరస్సు ఉండేదని, అక్కడ జీవం ఆనవాళ్లు దొరకొచ్చని భావిస్తున్నారు. అక్కడి మట్టి, రాళ్ల శాంపిల్స్ ను పరిశీలిస్తే మార్స్పై ఒకప్పుడు సూక్ష్మజీవుల వంటివి ఉండేవో, లేదో అన్నది తెలుస్తుందని చెప్తున్నారు. పర్సివరెన్స్ రోవర్ ద్వారా 2030 నాటికి అంగారకుడి నుంచి 30 శాంపిల్స్ ను సేకరించాలని నాసా టార్గెట్ గా పెట్టుకుంది.