టెర్రరిస్టుల్ని తయారు చేస్తున్నం: పాక్ సీక్రెట్స్ చెప్పిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు

టెర్రరిస్టుల్ని తయారు చేస్తున్నం: పాక్ సీక్రెట్స్ చెప్పిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు
  • ఒసామా బిన్ లాడెన్ మా హీరో
  • కశ్మీరీలకు టెర్రరిస్టు ట్రైనింగ్ ఇస్తున్నాం
  • జీహాదీలు పాకిస్థాన్‌ హీరోలు: ముషారఫ్
  • ట్విట్టర్‌లో పాక్ నేతలు, సామాజికవేత్తల తిట్లు

పాకిస్థాన్ ఓ ఉగ్ర దేశమని భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. కశ్మీర్ సహా దేశంలో అనేక ఉగ్రదాడులు చేసింది దాయాది దేశమేనని ప్రపంచ వేదికలపై గట్టిగా చెబుతూ వచ్చింది. వాటి సాక్ష్యాలు కూడా చూపించింది. కానీ ఆ దేశంలో అధికారంలో ఉన్న నాయకులు ఇప్పటి వరకు అబ్బే అదేం లేదే అంటూ బుకాయిస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా ‘బయటి వారెవరూ చెప్పక్కర్లేదు.. మా దేశం గురించి  మేమే చెప్పుకుంటాం’ అన్నట్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు తమది ఉగ్రదేశం, తమకు ఉగ్రవాదులే హీరోలంటూ ఆ దేశ కుట్రలన్నీ విప్పి చెప్పాడు. పైగా నిజమే చెబుతున్నా అంటూ గట్టిగా నొక్కి మరీ చెప్పాడు.

‘‘మేం ఉగ్రవాదుల్ని పెంచిపోషిస్తున్నాం.. 1979లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి సోవియట్‌ను తరిమేయడానికి తాలిబన్ ఉగ్రవాదుల్ని తయారు చేశాం. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించాం. ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ మాకు హీరో.. లష్కరే తొయిబా టెర్రరిస్టులు, తాలిబన్లకు ఆయుధాలు, శిక్షణ ఇస్తోంది మేమే. కానీ ప్రపంచం మా హీరోలను విలన్స్‌లా చూస్తోంది. అంతేకాదు.. కశ్మీర్‌లో హింసకు మేమే కారణం. కశ్మీరీలను జీహాదీలుగా తయారు చేస్తోందీ మేమే. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్టులుగా మేమే తయారు చేస్తున్నాం. కశ్మీర్‌లో పోరాటం చేస్తున్న మొజాహిద్దీన్ టెర్రరిస్టులకు ఆయుధాలు సప్లై చేస్తున్నాం. భారత ఆర్మీకి వ్యతిరేకంగా పని చేయడానికి వాళ్లకి మేం సపోర్ట్ ఇస్తున్నాం’’ అని పాకిస్థాన్ మాజీ అద్యక్షుడు, మిలటరీ మాజీ జనరల్ పర్వేజ్ ముషారఫ్ చెప్పారు. నిజాలే చెబుతున్నా అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్టు వివరించారు.

పాకిస్థానీలే తిట్టిపోశారు

పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త హమిద్ మండోఖలీ ఆ ఇంటర్వ్యూ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విధానాల వల్లే పాక్ ఇలా తయారైందని అన్నారు. పెషావర్‌లో పిల్లలపై ఉగ్రవాదుల దాడి, నిత్యం పాక్‌ బస్టాండ్లు సహా పలు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు ఇదే కారణమని మండిపడ్డారు. దీనిని పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఫరాతుల్లా బాబర్ రీ ట్వీట్ చేశారు. ముషారఫ్ చెప్పిందే కనుక నిజమైతే, తమ దేశంలోని రెండు తరాలను వీళ్లు నాశనం చేసినట్లని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్వంసం సృష్టించారంటూ తిట్టిపోశారు. అలాగే ఎన్నాళ్లకు పాక్ నిజం చెప్పిందంటూ భారతీయులు చాలా మంది ట్వీట్లు చేశారు.