ఢిల్లీలోకి పెట్రోల్​, డీజిల్​ బండ్లు బ్యాన్​

ఢిల్లీలోకి పెట్రోల్​, డీజిల్​ బండ్లు బ్యాన్​
  • కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ సర్కార్​ నిర్ణయం
  • 27 నుంచి డిసెంబర్​ 3 వరకు నిషేధం
  • కేవలం సీఎన్జీ, ఈవీలకే అనుమతి
  • ఎసెన్షియల్​ గూడ్స్​ వెహికల్స్​కు మినహాయింపు
  • సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీసులు రీ ఓపెన్​
  • ఉద్యోగుల కోసం స్పెషల్​ సీఎన్జీ బస్సులు

న్యూఢిల్లీ: కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చే అన్ని పెట్రోల్​, డీజిల్​ బండ్లను బంద్​పెట్టాలని నిర్ణయించింది. ఈ నెల 27 (శనివారం) నుంచి డిసెంబర్​ 3 వరకు వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. రోజువారీ సరుకులు, కూరగాయలు, మందుల వంటి వాటిని ట్రాన్స్​పోర్ట్​ చేసే ఎసెన్షియల్​ గూడ్స్​ వెహికల్స్​కు మాత్రం మినహాయింపునిస్తున్నామని, కేవలం కంప్రెస్డ్​ నేచురల్​ గ్యాస్​ (సీఎన్​జీ) వెహికల్స్​, కరెంట్​ బండ్లకే అనుమతినిస్తామని ఢిల్లీ ఎన్విరాన్మెంట్​ మినిస్టర్​ గోపాల్ రాయ్​ తెలిపారు. కొద్ది రోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం ఎంత ఎక్కువగా ఉందో తెలిసిందే. ఇంట్లో ఉన్నా కూడా మాస్కులు పెట్టుకోవాల్సి వస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కొన్నాళ్ల పాటు ఆఫీసులకు వర్క్​ ఫ్రం హోం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. గత పది రోజులతో పోలిస్తే ఇప్పుడు ఢిల్లీ గాలి చాలా వరకు బెటర్​ అయింది. గతంలో ఏక్యూఐ (ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​) 400 దాకా ఉండగా.. ఇప్పుడు 280కి తగ్గింది. 

29 నుంచి స్కూళ్లు, ఆఫీసులు
కాలుష్యం వల్ల ఇన్నాళ్లూ బంద్​ పెట్టిన బడులు, కాలేజీలు, లైబ్రరీలు, ప్రభుత్వ ఆఫీసులను ఈ నెల 29 నుంచి నుంచి తిరిగి తెరుస్తామని గోపాల్​ రాయ్​ తెలిపారు. ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని, వాళ్లంతా వాటిల్లోనే ప్రయాణించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులుండే కాలనీల నుంచి వాటిని నడుపుతామని తెలిపారు. సెక్రటేరియట్​ నుంచి ఐటీవో, ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్​ వరకు షటిల్​ బస్సు సర్వీస్​ను నడుపుతామన్నారు. దీపావళికి ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు గాలి మంచిగైందని చెప్పారు.