- కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ సర్కార్ నిర్ణయం
- 27 నుంచి డిసెంబర్ 3 వరకు నిషేధం
- కేవలం సీఎన్జీ, ఈవీలకే అనుమతి
- ఎసెన్షియల్ గూడ్స్ వెహికల్స్కు మినహాయింపు
- సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీసులు రీ ఓపెన్
- ఉద్యోగుల కోసం స్పెషల్ సీఎన్జీ బస్సులు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చే అన్ని పెట్రోల్, డీజిల్ బండ్లను బంద్పెట్టాలని నిర్ణయించింది. ఈ నెల 27 (శనివారం) నుంచి డిసెంబర్ 3 వరకు వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. రోజువారీ సరుకులు, కూరగాయలు, మందుల వంటి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే ఎసెన్షియల్ గూడ్స్ వెహికల్స్కు మాత్రం మినహాయింపునిస్తున్నామని, కేవలం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) వెహికల్స్, కరెంట్ బండ్లకే అనుమతినిస్తామని ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ తెలిపారు. కొద్ది రోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం ఎంత ఎక్కువగా ఉందో తెలిసిందే. ఇంట్లో ఉన్నా కూడా మాస్కులు పెట్టుకోవాల్సి వస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కొన్నాళ్ల పాటు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. గత పది రోజులతో పోలిస్తే ఇప్పుడు ఢిల్లీ గాలి చాలా వరకు బెటర్ అయింది. గతంలో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 400 దాకా ఉండగా.. ఇప్పుడు 280కి తగ్గింది.
29 నుంచి స్కూళ్లు, ఆఫీసులు
కాలుష్యం వల్ల ఇన్నాళ్లూ బంద్ పెట్టిన బడులు, కాలేజీలు, లైబ్రరీలు, ప్రభుత్వ ఆఫీసులను ఈ నెల 29 నుంచి నుంచి తిరిగి తెరుస్తామని గోపాల్ రాయ్ తెలిపారు. ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని, వాళ్లంతా వాటిల్లోనే ప్రయాణించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులుండే కాలనీల నుంచి వాటిని నడుపుతామని తెలిపారు. సెక్రటేరియట్ నుంచి ఐటీవో, ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్ వరకు షటిల్ బస్సు సర్వీస్ను నడుపుతామన్నారు. దీపావళికి ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు గాలి మంచిగైందని చెప్పారు.