వాహనదారులకు గుడ్ న్యూస్. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా..ఊహించని విధంగా తగ్గబోతున్నాయి. దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 15 కాబోతుంది. ఇది నిజం. స్వయంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్లో పర్యటించిన ఆయన.. ప్రతాప్గఢ్లో బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పెట్రోల్ ను రూ. 15కే వాహనదారులకు అందిస్తామన్నారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉందని నితిన్ గవర్కర్ తెలిపారు.
రూ. 15కే లీటర్ పెట్రోల్ ఎలా అంటే..
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో రూ.5600 కోట్ల విలువైన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే మొత్తం 219 కి.మీ. పొడవుతో రూ.3,775 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ జులై 04వ తేదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లీటర్ పెట్రోల్ రూ. 15కే లభించాలంటే వాహనదారులు పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ను ఉపయోగించాలని సూచించారు. వాహనాలకు ఇంధనం కోసం వాహనదారులు సగటున 60 శాతం ఇథనాల్..మరో 40 శాతం విద్యుత్ ను ఉపయోగిస్తే పెట్రోల్ లీటర్ రూ. 15కే లభిస్తుందని చెప్పారు. వాహనాలకు ఇథనాల్, విద్యుత్ ఉపయోగించడం వల్ల కాలుష్యంతో పాటు దేశంలో పెట్రోల్, డీజిల్ దిగుమతులు భారీగా తగ్గుతాయని..త్వరలో వీటి రేట్లు కూడా దిగివస్తాయన్నారు. వీటి ద్వారా భారత ప్రభుత్వానికి దాదాపు రూ. 16 లక్షల కోట్లు మిగులుతాయని..ఈ నగదు అంతా రైతుల ఖాతాల్లోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.