మన నేవీ సిబ్బందిపై పైరేట్ల కాల్పులు

మన నేవీ సిబ్బందిపై పైరేట్ల కాల్పులు

న్యూఢిల్లీ :  హిందూ మహాసముద్రంలో ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాలను ఇండియన్ నేవీ అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియోను నౌకాదళం ఎక్స్ (ట్విటర్)లో  షేర్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 14న 'ఎక్స్ ఎంవీ రుయెన్' నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. దాని సాయంతో ఇతర దేశాల నౌకలను దోచుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇండియన్ నేవీ శనివారం దొంగలు ప్రయాణిస్తున్న 'ఎక్స్ ఎంవీ రౌన్' నౌకను అడ్డగించింది. 

ఈ క్రమంలో కొందరు పైరెట్లు 'ఎక్స్ ఎంవీ రౌన్' నౌక డెక్ పైకి వచ్చి కాల్పులు జరిపారని ఇండియన్ నేవీ వెల్లడించింది. వెంటనే లొంగిపోవాలని, ఎవరైనా పౌరులు బందీలుగా ఉంటే విడిచిపెట్టాలని హెచ్చరించిట్లు పేర్కొంది. కొన్నిరోజులుగా  హిందూ మహాసముద్రంలో  సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ జెండాతో ఉన్న ఓ కార్గో నౌక సముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ నౌక నుంచి వచ్చిన ఎమర్జేన్సీ మెసెజ్ ఆధారంగానే తాజా ఘటన వెలుగులోకి వచ్చింది.