నాగర్ కర్నూల్, వెలుగు: ప్రాజెక్టులకు భూములు సేకరించేముందు నిర్వాసితులకు అండగా ఉంటామని చెబుతున్న సర్కారు.. పని పూర్తయ్యాక ఇచ్చింది తీసుకుని ముల్లెమూట సర్దుకోవాలన్నట్లు వ్యవహరిస్తోంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(నక్కలగండి) నిర్మాణం పూర్తి కావచ్చినా.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదు. నిర్వాసితులు ఐదేళ్లుగా పోరాటం చేస్తుండడంతో రిజర్వాయర్కు కేవలం100 మీటర్ల దూరంలో స్థలం కేటాయించింది. రిజర్వాయర్లోకి నీళ్లు వస్తే ఆ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో నిర్వాసితులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్లో ఆర్అండ్ఆర్ కమిటీ మెంబర్, సర్పంచ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. పరిహారం పైనా మరోసారి ఆలోచన చేయాలని కోరారు.
90 శాతం పూర్తయిన ప్రాజెక్టు
నల్గొండకు నీరందించేందుకు 2005లో జలయజ్ఞం కింద రూ. 7.64 టీఎంసీల సామర్థ్యంతో రూ.545 కోట్లతో నక్కలగండి వద్ద డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. ఇందుకోసం 2009లో భూసేకరణ మొదలు పెట్టి 3,155 ఎకరాలు సేకరించారు. ఇందులో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్నెవారిపల్లి, కేశ్యతండా, మర్లపాడు తండాల్లోని 2,361 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం గేట్లు బిగించడం మినహా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. అయినా నిర్వాసితులకు నేటికీ ఆర్అండ్ ప్యాకేజీ ఇవ్వడం లేదు.
2018 నుంచి పోరాటం..
రిజర్వాయర్లో భూములతో పాటు మర్లపాడు తండా, కేశ్యతండాలోని ఇండ్లు కూడా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఇక్కడ ఉన్న 347 కుటుంబాలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం 2018 నుంచి పోరాటం చేస్తున్నాయి. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇటీవల చందంపేట మండలంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న 39 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఇది రిజర్వాయర్కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉండడంతో బాధితులు మరోచో ట స్థలం చూపించాలని కోరుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాదు హైకోర్టు, మానవ హక్కుల కమిషన్లో కేసు నడుస్తున్నా.. వినకుండా ఇండ్లను ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారు. పరిహారం విషయంలోనూ నిర్వాసితులకు అన్యాయమే జరుగుతోంది. జిల్లాలో సేకరించిన 2,361 ఎకరాల్లో 1241 ఎకరాలకు రూ. 70 వేల నుంచి రూ. 5.50 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగతా 1120 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది.
రూ.40 కోట్లతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ
కేశ్యతండా, మర్లపాడుతండాల్లో 347 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.40 కోట్లు మంజూరు అయ్యాయని ఇటీవల నిర్వహించిన ఆర్అండ్ఆర్ కమిటీ మీటింగ్లో కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు. కుటుంబం యూనిట్గా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఏజెన్సీ ఏరియా కావడంతో అదనంగా మరో రూ.50 వేలు, తరలింపు ప్రక్రియకు రూ.50 వేలు, నెలకు రూ. 3 వేల చొప్పున 12 నెలలకు రూ. 36 వేలు, పీఎం ఆవాస్ యోజన కింద రూ.1.25 లక్షలు కలిపి రూ. 7.61 లక్షలు ఇస్తామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, తాగు నీరు, స్కూల్ బిల్డింగ్, దేవాలయం తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కలెక్టర్ ప్రతిపాదనలపై మర్లపాడుతండా సర్పంచ్ భాస్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభ తీర్మానం లేకుండా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. హైకోర్టులో రిట్ ఫిటిషన్ ఉండగానే అవార్డు పాస్ చేయడం, ఇష్టం వచ్చినట్లు రేట్ ఫిక్స్ చేయడం, పునరావాస స్థలంపై అభ్యంతరం చెప్పినా నోటిఫికేషన్ ఇవ్వడం ఆర్డీవోకే చెల్లిందని మండిపడ్డారు.
స్థలం మార్చాలి.. పరిహారం పెంచాలి
రిజర్వాయర్కు 100 మీటర్ల దూరంలో ఉన్న పునరావాస స్థలాన్ని మార్చాలి. ఒక్కో కుటుంబానికి 150 గజాలకు బదులు 250 గజాల స్థలం కేటాయించాలి. భూములతో పాటు కుటుంబానికి ఇచ్చే పరిహారం కూడా పెంచాలి. ఐటీడీఏ, ఫారెస్ట్ ఆఫీస్లు లేకుండా రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామ సభసభలకు కాపీలు బయటపెట్టాలి.
- భాస్కర్, మర్లపాడు తండా సర్పంచ్, ఆర్అండ్ఆర్ కమిటీ మెంబర్