- తామే భరించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం
- సాధారణ నిధుల నుంచి విడుదల పై ఇంకా రాని స్పష్టత
- హరితహారానికి దూరంగా మున్సిపల్ చైర్మన్, సభ్యులు
- జిల్లాలో చర్చనీయాంశంగా కౌన్సిల్ తీరు
గద్వాల మున్సిపాలిటీలో కోవిడ్ నియంత్రణ కోసం పెట్టిన ఖర్చు కాక రేపుతూనే ఉన్నది. బిల్లులపై ఆఫీసర్స్ మున్సిపల్ కౌన్సిల్ మధ్య సైలెంట్ వార్ నడుస్తున్నది. ఖర్చులు ఎక్కువగా చూపుతున్నారని కలెక్టర్ బిల్లులను తిరస్కరించడంతో తామే భరించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కానీ సాధారణ నిధుల నుంచి ఎలా విడుదల చేయాలనే దానిపై స్పష్టత రాకపోవడంతో పంచాయితీ నడుస్తూనే ఉన్నది. గురువారం ప్రారంభమైన హరితహారం కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. కేవలం ఆఫీసర్లు మాత్రమే మొక్కలు నాటారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించినా.. మున్సిపల్ చైర్మన్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇష్టం వచ్చినట్లు బిల్లుల తయారీ..
కరోనా నియంత్రణ కోసం గద్వాల మున్సిపాలిటీ లో రూ. 50 లక్షల వరకు ఖర్చు చేశారు. హైపో క్లోరైడ్ ద్రావణం తెప్పించేందుకు రూ .70,000, డ్రోన్ సాయంతో స్ప్రే చేసినందుకు రూ. 96,400, ట్రాక్టర్ల ద్వారా స్ప్రే చేసినందుకు రూ.3,77,500, మూడు డిస్ ఇన్పెక్షన్ రూంలకు రూ. 75,000, మాస్కుల తయారీకి రూ. రూ. 96,840, బ్లీచింగ్ పౌడర్ కు రూ. 66,000, ఇందులో కలిపేసున్నానికి రూ. 63,130, హోం క్వారంటైన్లో ఉన్న వారికి సరుకులకు రూ.1,11,611, – ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెప్పించిన 20 ఆటోల కిరాయి రూ. 3,07,000, ఫ్లెక్సీలకు రూ.9,550, – పాంప్లెట్స్కు రూ. 30,000, ఐడీ కార్డులకు రూ. 1,94,700, చనిపోయిన వారికి ఖననం చేసేందుకు తవ్వించిన గుంతలకు రూ. 2,00,000, జిరాక్స్ పేపర్ బెండల్ స్కు రూ. 23,636, మెడికల్ సిబ్బందికి టీలు, స్టేషనరీ ఇచ్చినందుకు రూ. 69,800… ఇలా రూ. 30 లక్షల వరకు బిల్లులు వేశారు. ఆటోల ద్వారా కూరగాయల పంపిణీ, బారికేడ్లకు మరో రూ.20 లక్షల వరకు బిల్లులు రెడీ చేసి నిధుల కోసం కలెక్టర్ కు నివేదించారు.
రీ ఎస్టిమేషన్ లేకుండానే..
కరోనా బిల్లులను కలెక్టర్ తిరస్కరించడంతో మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో తామే భరించాలని తీర్మానం చేశారు. వాస్తవానికి రీ ఎస్టిమేషన్తో మళ్లీ బిల్లులు పెట్టాల్సింది. కానీ అలా చేయకుండా మున్సిపాలిటీ నుంచి నిధులు చెల్లిస్తామని తీర్మానం చేశారు. దీనిపై విపక్ష నేతలు మండిపడుతున్నారు . కోవిడ్ పేరిట మున్సిపల్ నిధులను జేబులో వేసుకునేందుకే ఇలా చేశారంటూ ఆరోపిస్తున్నారు. నిజానికి సాధారణ నిధులనుంచి ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు . కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం కలెక్టర్కే సర్వాధికారాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో కౌన్సిల్ సభ్యులు జిల్లా నిధుల్లో నుంచే బిల్లులు విడుదల చేయాలని మళ్లీ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో హరితహారంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇక్కడా కలెక్టర్ ససేమిరా అనడంతో మున్సిపల్ చైర్మన్, సభ్యులు హరితహారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఆఫీసర్లు మాత్రమే మొక్కలునాటారు.
రాష్ట్రంలో ఎక్కడా లేదు
రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోనూ కరోనా పేరిట రూ. 50 లక్షల నిధులు ఖర్చు చేయలేదని జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపే ఖర్చు పెట్టగా.. ఆయా కలెక్టర్లు బిల్లులు కూడా మంజూరు చేశారని అంటున్నారు . గద్వాల లోనూ రీజనబుల్ రేట్లతో బిల్లులు పెడితే సమస్య ఉండకపోయేదని, ఇష్టం వచ్చినట్లు ఖర్చులు చూపడంతోనే అభ్యంతరం పెడుతున్నామన్నారు.
ఆఫీసర్లు చెప్పినందుకే చేశాం
జిల్లా ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చినందుకే గద్వాల మున్సిపాలిటీలో కరోనా నివారణ చర్యలు చేపట్టామని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు వాదిస్తున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో కూరగాయలు సప్లై చేసిన ఆటో వాళ్లు , బారికేడ్లు కట్టిన కార్మికులు, మాస్కులు తయారీ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. తరచూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని వెంటనే నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.