- 2026 ‘నాణ్యత’కు అంకితం
- మన యూత్ అద్భుతాలుచేస్తున్నది
- ఓటు హక్కు కాదు.. బాధ్యత
- ‘అనంత నీరు’ ప్రాజెక్ట్ అందరికీ స్ఫూర్తిదాయకం
- 130వ మన్ కీ బాత్లో ప్రధాని
న్యూఢిల్లీ: భారతీయ ఉత్పత్తులు అంటే.. ప్రపంచవ్యాప్తంగా టాప్ క్వాలిటీ అనే భావన కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇక్కడున్న పరిశ్రమలు, స్టార్టప్లు తమ వస్తువుల తయారీలో నాణ్యతపై దృష్టి సారించాలని కోరారు. మన ఉత్పత్తులు కేవలం ఇండియాలో తయారవ్వడమే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాణ్యతను ఒక బెంచ్మార్క్లా చేసేందుకు సంకల్పించాలని సూచించారు. జీరో డిఫెక్ట్... జీరో ఎఫెక్ట్ మంత్రను పాటించాలన్నారు.
ప్రధాని మోదీ ఆదివారం (జనవరి 25) తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 130వ ఎపిసోడ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి. అలాగే వస్తువుల తయారీలో రాజీ పడకూడదు. జీరో డిఫెక్ట్... జీరో ఎఫెక్ట్ విధానాన్ని తయారీదారులు, స్టార్టప్లు అమలు చేయాలి’’అని సూచించారు.
టాప్ క్వాలిటీకి పర్యాయపదంగా ఉండాలి
ఇండియన్ ప్రోడక్ట్స్ టాప్ క్వాలిటీకి పర్యాయపదంగా మారాలని ప్రధాని మోదీ సూచించారు. ‘‘బట్టలు, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్.. ఇలా మనం తయారు చేసే ఏ వస్తువైనా ఉత్తమంగా ఉండేలా చూడాలి. యువతకు అన్ని రంగాల్లో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రపంచ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. ఇండియాలో పెద్ద సంఖ్యలో స్టార్టప్లతో లక్షలమంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. విదేశాలకు వెళ్లే ఇండియన్స్.. అక్కడ మన దేశ ఉత్పత్తుల గురించి గర్వంగా చెప్పేలా నాణ్యత ఉండాలి. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. దానిని విదేశీయులు గౌరవిస్తారు’’అని అభినందించారు.
యువత ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలి
ఇండియా యువత వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలను మోదీ ప్రశంసిస్తూ, ఫిట్నెస్ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. జనవరి 25న జరుపుకునే ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ ప్రాముఖ్యతను వివరించారు. ‘‘ఇండియన్ డెమోక్రసీలో ప్రతి ఓటరు కీలక పాత్ర పోషిస్తారు. ఓటరే ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటివారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదు.. అది ప్రతి పౌరుడి బాధ్యత’’అని మోదీ అన్నారు.
ఇండియన్ స్టార్టప్లు సత్తా చాటుతున్నయ్..
ఏఐ, అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో ఇండియన్ స్టార్టప్లు సత్తా చాటుతున్నాయని ప్రధాని అన్నారు. ఈ ప్రగతిలో యువత ఎంపికలు, ఆవిష్కరణలే కీలకమన్నారు. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ రోజు రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను స్మరించుకునేందుకు ఒక గొప్ప అవకాశమని తెలిపారు.
అనంతపురం ప్రజల చొరవ భేష్
ఏపీలోని అనంతపురం జిల్లా ప్రజలు చూపిన చొరవ.. దేశంలోని మిగిలిన కరువు ప్రాంతాలకు ఒక గొప్ప పాఠం అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇది స్థానిక యంత్రాంగానికి, ప్రజలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. ‘‘వర్షపాతం సరిగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర నీటి కోరత ఎదుర్కొన్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రజలు స్వయంగా జలాశయాలను పునరుద్ధరించడానికి ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఇప్పటి వరకు 10కి పైగా జలాశయాలను పునరుద్ధరించారు. 7 వేలకు పైగా చెట్లను నాటారు. ఇవి నేడు ఆ ప్రాంతంలో మినీ అడవుల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో వర్షపు నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరిగింది. ఇది చుట్టుపక్కల బోర్లలో నీటి మట్టం పెరగడానికి దోహదపడింది’’అని మోదీ పేర్కొన్నారు.
