- దేశ అభివృద్ధిలో యువత పాత్రే కీలకం.. వికసిత్ భారత్ కలను వారు నెరవేరుస్తారు
- భారత క్రీడారంగానికి నవంబర్ సూపర్ హిట్ నెల
- మహిళల అంధులక్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది
- మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్కు ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పరిశోధన రంగంలో దేశం దూసుకుపోతున్నదని చెప్పారు. మన యువత అసమాన శక్తి, బలమైన సంకల్పంతోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని అన్నారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. గత 11 ఏండ్లలో సైన్స్, స్పోర్ట్స్, సోషల్ సర్వీస్, కల్చరల్లాంటి వంటి వివిధ రంగాల్లో యువత అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. కష్టతరమైన వాటిని కూడా భారత్ సాధిస్తున్నదని చెప్పారు.
యువత అభిరుచి, సైంటిస్టుల అంకిత భావాన్ని చూసిన ప్రతిసారి తన హృదయం సంతోషంతో ఉప్పొంగుతుందని తెలిపారు. యువతే మన దేశ బలమన్నారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియాలాంటి సంస్కరణలతో మన యువత.. వికసిత్ భారత్ కలను సాకారం చేస్తుందనే నమ్మకం తనకు ఉన్నదని చెప్పారు. మార్స్ గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా రూపొందించి.. డ్రోన్లను ఎగురవేయడానికి మన యువత ప్రయత్నించారని, ఇందుకు సంబంధించిన వీడియో తనను ఆకట్టుకున్నదని చెప్పారు.
స్పోర్ట్స్లో మన క్రీడాకారులు సత్తాచాటారు
భారత క్రీడారంగానికి గడిచిన నవంబర్ ఒక సూపర్ హిట్ నెలగా నిలిచిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రికెట్ నుంచి కబడ్డీ, బాక్సింగ్ వరకు వివిధ రంగాల్లో మన క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ‘‘ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలవడంతో ఈ నెల విజయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా మన వాళ్ల జోరు కొనసాగింది. కొద్ది రోజుల క్రితం టోక్యోలో జరిగిన డెఫ్లింపిక్స్లో మన క్రీడాకారులు 20 పతకాలు సాధించారు.
భారత మహిళా కబడ్డీ జట్టు ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నది. ఈ విజయాలన్నింటిలోనూ అంధుల మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం అత్యంత ప్రత్యేకమైనది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచారు. ఈ విజయం తర్వాత ఆ జట్టు సభ్యులను నా నివాసంలో కలుసుకున్నా” అని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే అవకాశాన్ని భారత్ దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
రక్షణ రంగం బలోపేతం
దేశ రక్షణ రంగం రోజురోజుకూ బలోపేతం అవుతున్నదని ప్రధాని మోదీ తెలిపారు. శత్రుదేశ జలాంతర్గాములపై పాశుపతాస్త్రంలా పనిచేసే సైలెంట్హంటర్ ఐఎన్ఎస్మాహేను నేవీ ప్రారంభించిందని చెప్పారు. కేరళ, తమిళనాడు ప్రజలు దీన్ని ప్రశంసించారని చెప్పారు. మన నేవీ వేగంగా స్వావలంబన దిశగా ముందుకు వెళ్తున్నదని అన్నారు. డిసెంబర్ 4న నేవీ డేను జరుపుకోబోతున్నామని, ఇది ధైర్యవంతులైన నేవీ సిబ్బందిని గౌరవించే అవకాశమన్నారు. డిసెంబర్ 2న కాశీలోని నమోఘాట్లో కాశీ– తమిళ సంగమం ప్రారంభమవుతుందని, తమిళ భాషను ప్రేమించే వారందరికీ ఇదొక వేదికగా మారిందని చెప్పారు.
ఈసారి ‘తమిళం నేర్చుకోండి ..- తమిళ కరకాలం’ అనే థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ రంగంలో కూడా దేశం గొప్ప విజయాన్ని సాధించిందని, 35.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. దేశంలో గత 11 ఏండ్లలో తేనె ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యిందని, ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయని చెప్పారు. ఖాదీ గ్రామొద్యోగ్ ద్వారా 2.25 లక్షలకు పైగా తేనె పెట్టెలు పంపిణీ చేశామని వివరించారు. రాంబన్ సులై తేనెకు జీఐ ట్యాగ్ లభించిందని, కర్నాటకలోని పుత్తూరు, తుమకూరు జిల్లాల్లోని రైతుల సంఘాల ప్రయత్నాలు బాగున్నాయని ప్రశంసించారు.
