లోక్ సభలో దాడి ఘటన వెనుక విపక్షాల కుట్ర ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ. విపక్షాలు దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని విపక్షాలపై సీరియస్ అయ్యారు.
నవంబర్ 13న లోక్ సభలోకి ఇద్దరు అగంతకులు కలర్ స్మోక్ తో గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై యావత్ దేశంలో ఉలిక్కి పడింది. అయితే ఈ ఘటనపై పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో అపోజిషన్ పార్టీ లీడర్లు ఆందోళనలు చేపడుతున్నారు. డిసెంబర్ 18న సోమవారం సభ ప్రారంభమైన వెంటనే కొందరు సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని సభను అడ్డుకున్నారు. సెక్యూరిటీ బ్రీచ్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడాలంటూ పట్టుబట్టారు.
దీంతో సభా నియమాలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సోమవారం ఒకే రోజు 79 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. పోయిన వారం లోక్సభ నుంచి 13 మంది, రాజ్యసభ నుంచి ఒకరు (డెరెక్ ఓబ్రియెన్)పై వేటు వేశారు. దీంతో ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన వారి సంఖ్య మొత్తం 93కు చేరుకుంది.