గ్లోబల్ ఇన్వెస్టర్లకు మోడీ పిలుపు
సౌదీ అరేబియా ఆర్థిక సదస్సులో ప్రధాని ప్రసంగం
కింగ్ సల్మాన్, క్రౌన్ప్రిన్స్ ఎంబీఎస్తో చర్చలు.. పలు ఒప్పందాలు
రియాద్: దేశంలోని త్రీటైర్(మూడో శ్రేణి) సిటీల్లోనూ స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయని, ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఇండియా ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దీన్నుంచి లాభాలు పొందేందుకు పెట్టుబడులతో రావాల్సిందిగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్(ఎఫ్ఐఐ) పేరుతో సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఆర్థిక సదస్సులో మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘దావోస్ ఇన్ డెజర్ట్’గా పిలిచే ఈ సదస్సులో ఆర్థిక వ్యవస్థలపై చర్చతోపాటు వరల్డ్ ట్రెండ్స్ను అర్థం చేసుకోడానికి వీలవుతుందని, తద్వారా ప్రపంచ సంక్షేమానికి మార్గాల్ని కనిపెట్టడం సులువవుతుందని నిర్వాహకులను మోడీ కొనియాడారు. వచ్చే ఐదేండ్లలో ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ మేరకు అన్ని రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు.
సౌదీ అరేబియాతో ఇండియా ట్రేడ్ రిలేషన్ను గుర్తుచేస్తూ ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ పైప్లైన్లు, గ్యాస్ టెర్మినల్స్ నిర్మాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య 2024నాటికి 100 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని, ‘‘వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్”పేరుతో ఆసియాలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్మించబోతున్నాయని మోడీ గుర్తుచేశారు. టెర్రరిజం, మిడిల్ఈస్ట్లో కల్లోలంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. దేశాల మధ్య సంక్షోభాల్ని నివారించడంలో యునైటెడ్ నేషన్స్(యూఎన్) ఆశించినమేరకు పనిచేయడంలేదని, యూఎన్ స్వరూపాన్ని రీఫామ్ చేయాల్సిన అవసరముందని మోడీ అన్నారు. ఎఫ్ఐఐ సదస్సులో పాల్గొనడానికి ముందు సౌదీ రాజు సల్మాన్ బిన్తో, క్రౌన్ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
చారిత్రాత్మక బంధం
సౌదీతో ఇండియాకు వందల ఏండ్లుగా ఫ్రెండ్షిప్ కొనసాగుతున్నదని, అభివృద్ధిలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ వినియోగదారైన ఇండియా తాను దిగుమతి చేసుకునే చమురులో 17 శాతం, ఎల్పీజీలో 32 శాతం సౌదీ అరేబియానుంచే వస్తుండడం తెలిసిందే. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సౌదీ నుంచి 40.33 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ను ఇండియా దిగుమతి చేసుకుంది.