
- కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఆలయ దర్శనం
- మోడీతో పాటు పూజలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
అయోధ్య: కోట్లాది మంది హిందువులు, ఏళ్ల నాటి నుంచి ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ రామజన్మభూమిలో భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం అయోధ్యకు చేరుకున్నారు. ముందుగా హనుమాన్ గర్హీ ఆలయంలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. హనుమంతుడికి హారితి ఇచ్చి పూజలు చేశారు. పూర్తిగా కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ ఆలయ దర్శనం చేసుకున్నారు ప్రధాని. మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత రామ్లల్లాను సందర్శించిన మోడీ ప్రత్యేక పూజలు చేసి సాష్టాంగ నమస్కారం చేశారు. సంప్రదాయ బద్దంగా ప్రత్యేక పట్టుపంచ, కుర్తాతో మోడీ ఆకట్టుకున్నారు. అంతకు ముందు ప్రత్యేక చాపర్లో అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోడీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. రామజన్మభూమి, హనుమాన్ ఆలయాన్ని దర్శించిన మొదటి ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు.