
న్యూఢిల్లీ: సౌత్ ఏషియా రీజియన్లో శాంతి నెలకొల్పే విషయంలో ఇండియా ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అమెరికా ప్రెసిండెంట్ డోనాల్డ్ ట్రంప్కు సోమవారం ఫోన్చేసి మాట్లాడిన ఆయన.. రీజియన్లో ఇండియాకు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు అంతర్జాతీయ వేదికలపై వాక్చాతుర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటోళ్లవల్ల శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతున్నదని, క్రాస్బోర్డర్ టెర్రరిజాన్నీ అణిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి మోడీ ఈ కామెంట్లు చేశారు. 30 నిమిషాల పాటు సాగిన సంభాషణలో ద్వైపాక్షిక అంశాలతోపాటు సౌత్ ఏషియా వ్యవహారాలపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
సోమవారం 100వ స్వాంత్ర్యదినోత్సవాన్ని జరుపుకొంటున్న ఆఫ్ఘనిస్తాన్ను ప్రస్తావిస్తూ.. ఆఫ్ఘన్ పూర్తిస్థాయి ప్రజాస్వామిక దేశంగా ఎదిగేందుకు ఇండియా తన వంతు సహకారం అందిస్తుందని మోడీ పునరుద్ఘాటించారు. అలాగే దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధుల నిర్మూల కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్నీ వివరించారు. ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయంపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శనివారం చర్చ జరగడానికి కొద్దిగంటల ముందు ట్రంప్కు ఫోన్చేసి పాక్ పీఎం ఇమ్రాన్ తన గోడు వెళ్లబోసుకున్నారు. కాశ్మీర్పై జోక్యం చేసుకునేందుకు చైనా తప్ప సెక్యూరిటీ కౌన్సిల్లోని ఇతర దేశాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్కు మోడీ ఫోన్కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. కాశ్మీర్ ఇండియా అంతర్గత వ్యవహారమని మోడీ క్లారిటీ ఇచ్చారు.
22 నుంచి మోడీ విదేశీ టూర్లు
ఫ్రాన్స్తోపాటు రెండు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22న ప్యారిస్కు వెళ్లనున్న మోడీ.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ తో డిఫెన్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఇతర అంశాల్లో సహకారంపై చర్చలు జరుపుతారు. అటునుంచటే 23న యూఏఈలో అడుగుపెట్టనున్న మోడీ, 24న బహ్రెయిన్కు చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం‘ఆర్డర్ ఆఫ్ జయేద్’ను మోడీ స్వీకరిస్తారని, దుబాయ్ క్రౌన్స్ప్రిన్స్తోనూ ప్రధాని సమావేశం కానున్నారని అధికారులు చెప్పారు. బెహ్రెయిన్లో ఇండియా ప్రధాని పర్యటించడం చరిత్రలో ఇదే తొలిసారి.