
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల స్వరూపం మారిపోయిన ప్రస్తుత తరుణంలో ఒక పార్టీ వరుసగా రెండోసారీ అధికారంలోకి రావడమనేది చాలా పెద్ద విషయమని, మహారాష్ట్ర, హర్యానాలో ప్రజలు బీజేపీని నమ్మినందుకు థ్యాంక్స్ చెబుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలోని పార్టీ హెడ్క్వార్టర్స్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
‘‘మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ సాధించిన విజయం చాలా అపూర్వమైంది. 2014కంటే ముందు ఆ రెండు రాష్ట్రాల్లో మనం జూనియర్ పార్ట్నర్గా ఉండేవాళ్లం. శివసేనలాంటి మిత్రులు చెప్పినట్లు వింటూ, వాళ్లు ఇచ్చిన సీట్లలోనే పోటీ చేసేవాళ్లం. ఐదేండ్ల కిందటి గెలుపుతో దేవేంద్ర ఫడ్నవిస్, మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంలుగా గెలిచారు. అంతకుముందు కనీసం మంత్రులుగా పనిచేసిన అనుభవం లేకున్నా వాళ్లిద్దరూ ప్రజల కోసం కష్టపడి పనిచేశారు. అందుకే వాళ్లిద్దరినీ ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. హర్యానా ప్రజలు ప్రతి ఐదేండ్లకు ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు. ఫస్ట్టైమ్ ఆ సెంటిమెంట్ను బీజేపీ బ్రేక్ చేసింది. వరుసగా రెండోసారి అతిపెద్ద పార్టీగా నిలవడమేకాదు, ఓటింగ్ శాతాన్ని కూడా 33 నుంచి 36 శాతానికి పెంచుకుంది. 2014కంటే ముందు హర్యానాలో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాకపోయింది. అప్పటి స్థితితో పోల్చుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రజల మనసులు గెల్చుకుంది”అని మోడీ అన్నారు.