ఇండియన్ నేవీ కొత్త జెండా ఆవిష్కరణ

ఇండియన్ నేవీ కొత్త జెండా ఆవిష్కరణ

ఇండియన్ నేవీ కొత్త జెండాను పీఎం మోడీ ఆవిష్కరించారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ జలప్రవేశం సందర్భంగా  భారత నావికాదళం నూతన జెండాను ప్రధాని మోడీ ప్రజెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు మరి కొందరు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఛత్రపతి శివాజీ స్పూర్తితో..
నేవీ నూతన  జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మ‌రాఠా యోధుడు ఛ‌త్రప‌తి శివాజీ స్పూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్ చేశారు. శివాజీకి నౌకాద‌ళం ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ప్రేర‌ణ‌తో ఆ జెండాలో గుర్తును క‌లిపారు. బ్లూ క‌ల‌ర్ ఆక్టోగోన‌ల్ ఆకారంలో ఉన్న గుర్తును నేవీ జెండాలో డిజైన్ చేశారు. అష్టాకారంలో ఉన్న గుర్తులో రెండు గోల్డ్ క‌ల‌ర్ బార్డర్లు ఉన్నాయి.  శివాజీ ద‌ళంలో సుమారు 60 యుద్ధ నౌక‌లు ఉండేవి. అత‌ని వ‌ద్ద 5000 మంది నావికులు ఉండేవారు. శివాజీ పాల‌న స‌మ‌యంలో మ‌రాఠా నౌకాద‌ళం శ‌క్తివంతంగా ఉండేది. తీర ప్రాంతాన్ని ఆ ద‌ళం నిత్యం ర‌క్షిస్తూ ఉండేది. అష్టాకారం అంటే ఎనిమిది దిక్కులు అని పిలిచేవారు.  అన్ని దిక్కుల్లోనూ నౌకాద‌ళం అబేధ్యంగా ఉన్నట్లు గుర్తుండే రీతిలో ఆ ముద్రను డిజైన్ చేసిన‌ట్లు నేవీ వెల్లడించింది. 

జెండాను మార్చడం ఇది నాల్గోసారి.. 
ఇండియన్ నేవీ జెండాను మార్చడం ఇది నాల్గో సారి. 1950 నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు జెండాను మార్చారు. దేశ  స్వాతంత్య్రం తర్వాత.. రాయల్ ఇండియన్ నేవీని... రాయల్ ఇండియన్ నేవీ, రాయల్ పాకిస్థాన్ నేవీగా విభజించారు. జనవరి 26, 1950న భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించడంతో రాయల్ అనే ప‌దాన్ని తొల‌గించారు.  అప్పట్నుంచి ఇండియన్ నేవీగా వ్యవహరిస్తున్నారు. 2001 వరకు ఉన్న చిహ్నాన్ని మార్చి తర్వాత నేవీ బ్లూ కలర్ ఇండియన్ నేవీ క్రెస్ట్‌ని తీసుకువచ్చారు. 2004లో అశోక చిహ్నాన్ని తిరిగి చేర్చారు. 2001లో నావికాదళ చిహ్నం తొలగించారు.  2014లో అశోక్ చిహ్నం కింద జాతీయ నినాదం “సత్యమేవ జయతే” ను చేర్చారు.  తాజాగా మరోసారి మార్పులు చేశారు.