గోదావరిఖని, వెలుగు: దేశంలోనే మొట్టమొదటి సారిగా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్పై పైలట్ ప్రాజెక్ట్గా నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. శనివారం వర్చువల్గా జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ మేనేజ్మెంట్ ఏర్పాట్లు చేసింది. దీనితో పాటు కేరళలోని కాయంకుళం ఎన్టీపీసీ రిజర్వాయర్పై నిర్మించిన 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ను కూడా జాతికి అంకితం చేయనున్నారు.
రూ.423 కోట్ల వ్యయంతో నిర్మాణం
రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్పై 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.423 కోట్ల ఖర్చుతో నీళ్లపై తేలే సోలార్ ప్లాంట్ను బీహెచ్ఈఎల్ నిర్మించింది. 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్ కు 2019 జనవరిలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ కరోనా వల్ల పనులు ఆలస్యమై 2022 జులై 1 నాటికి చేయడాన్ని పూర్తి చేసింది. మొత్తం 40 బ్లాక్లుగా విభజించగా, ఒక్కో బ్లాక్లో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా నిర్మాణం చేశారు. ప్రతి బ్లాక్లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్ ఫామ్తో పాటు 11,200 సోలార్ మ్యాడ్యూల్స్, ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్టీ బ్రేకర్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డుకు 33 కేవీ అండర్గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల భూమి అవసరం లేకపోగా, ఏడాదికి రిజర్వాయర్పై 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఆవిరి కాకుండా, ఏటా 1.65 లక్షల టన్నుల బొగ్గు వినియోగాన్ని, 2.10 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను నివారించవచ్చు. కాగా ఈ పవర్ను గ్రిడ్కు అనుసంధానం చేసి పూర్తిగా తెలంగాణ స్టేట్కే కేటాయించనున్నారు.
ప్రపంచంలో బొగ్గును ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు పలు దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. బొగ్గును మండించడం, దాని నుంచి వచ్చే బూడిద వల్ల కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుండడంతో దేశంలో కూడా బొగ్గుతో విద్యుత్, ఇతర పరిశ్రమల ఏర్పాటుపై కేంద్రం సీరియస్గా ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే సంప్రదాయ ఇంధన వనరుల వాడకంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా దేశంలోనే మొదటి సారిగా రామగుండంలో నీటిపై తేలియాడే పోటో వోల్టాయిక్ సోలార్ పవర్ జనరేషన్ను పైలట్ ప్రాజెక్ట్ను చేపట్టింది. దీనికితోడుగా కేరళలోని కాయంకుళం ఎన్టీపీసీలో కూడా 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఏపీలోని సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్లో 25 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ను కూడా మేనేజ్మెంట్ అందబాటులోకి తీసుకురానున్నది. దేశ వ్యాప్తంగా 2032 నాటికి ఎన్టీపీసీ సంస్థ తాను ఉత్పత్తి చేస్తున్న విద్యుత్లో సుమారుగా 10 శాతం పవర్ను సోలార్ ద్వారానే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ వేసి అందుకునుగుణంగా ముందుకు సాగుతున్నది.