సంగీత ప్రపంచంలో టాప్ అవార్డుగా చూసే గ్రామీ పురస్కారం గెలుచుకున్న ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు రిక్కీ కేజ్, భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్ ఫల్గుణి షాలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్కు బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ పురస్కారం సొంతం చేసుకున్న రిక్కీకి కంగ్రాట్స్ చెప్పారు. తాను సాధించిన ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప శిఖరాలను చేరుకోవాలని ఆకాక్షించారు.
Congratulations for this remarkable feat and best wishes for your future endeavours! https://t.co/scBToyGCjL
— Narendra Modi (@narendramodi) April 4, 2022
అలాగే బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో పురస్కారాన్ని దక్కించుకున్న ఫల్గుణికి ప్రధాని మోడీ కంగ్రాట్స్ చెప్పారు. ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని విషెస్ తెలిపారు.
Congratulations to Falguni Shah on winning the award for the Best Children’s Music Album at the Grammys. Wishing her the very best for her future endeavours. @FaluMusic
— Narendra Modi (@narendramodi) April 5, 2022
కాగా, నిన్న లాస్ వేగాస్లో గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఎంజీఎం గ్రాండ్ మార్క్యూ బాల్ రూమ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వేడుకలో ప్రపంచదేశాలకు చెందిన మ్యుజీషియన్లు పాల్గొన్నారు. భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు అందుకున్నారు. ప్రముఖ అమెరికన్ కంపోజర్, రాక్ లెజెంట్ స్టీవర్ట్ కోప్లాండ్తో కలసి రిక్కీ కేజ్ రూపొందించిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్కు బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ పురస్కారం దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం నమస్తే అంటూ అక్కడ ఉన్నందరినీ రిక్కీ కేజ్ విష్ చేయడం విశేషం. గ్రామీ అవార్డు రావడం సంతోషంగా ఉందని, తనకు ఇది రెండో గ్రామీ అవార్డు అని ఆయన ఇన్ స్టాలో ఫొటో షేర్ చేశారు. యూఎస్ లో పుట్టిన రిక్కీ.. చాలా ఏళ్ల కింద భారత్ కు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉంటున్నారు. 2015 లో స్టీవర్ట్ కోప్లాండ్ తో కలసి చేసిన విండ్స్ ఆఫ్ సంసార ఆల్బమ్ రిక్కీకి మొదటి గ్రామీని అందించింది.
ఇక ఇండియన్ అమెరికన్ సింగర్ ఫల్గుణి షాకు కూడా గ్రామీ అవార్డు దక్కింది. ఫలూ పేరుతో స్టేజ్ షోలు నిర్వహిస్తున్న ఆమె.. బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో పురస్కారాన్ని దక్కించుకున్నారు. ‘ఎ కలర్ఫుల్ వరల్డ్’ ఆల్బమ్ కు గానూ ఆమెకు ఆ అవార్డు దక్కింది. కాగా, గతంలో ఏఆర్ రెహ్మాన్ తో కలసి ఫల్గుణి పని చేసింది.