సర్దార్ స్ఫూర్తితోనే కశ్మీర్ సమస్య పరిష్కారం: మోడీ

సర్దార్ స్ఫూర్తితోనే కశ్మీర్ సమస్య పరిష్కారం: మోడీ

భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోడీ చెప్పారు. తన 69వ పుట్టిన రోజు సందర్భంగా మోడీ ఈ రోజు నర్మదా తీరంలో ఐక్యతా చిహ్నం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) పేరుతో ఏర్పాటు చేసిన పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం కెవాడియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

సర్దార్ విజన్ వల్లే ఈ రోజు హైదరాబాద్ విమోచన దినం జరుపుకోగలుగుతున్నామని మోడీ అన్నారు. ధైర్యంగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్ స్టేట్ భారతంలో భాగమైందని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యను ఆర్టికల్ 370 రద్దుతో తమ ప్రభుత్వం పరిష్కరించగలిగిందన్నారు.

ఈ సభకు ముందు ప్రధాని మోడీ నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్ ను సందర్శించి పూజలు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల అవసరాలు తీరుతున్నాయని అన్నారు.