బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి 56 శాతం నిధులు వస్తే.. కాంగ్రెస్కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయన్నారు. బీజేపీకి రూ.వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. మార్చి 21వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీ భారీగా లాభపడిందన్నారు సోనియా. తాము ప్రజల నుంచి న్యాయబద్ధంగా సేకరించిన నిధులను ఐటీ ఫ్రీజ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అధికార పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు అసాధారణమైనవని, అప్రజాస్వామికమైనవని సోనియా అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ను అర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రం తీరు సరిగ్గా లేదన్న ఆమె.. కాంగ్రెస్ అకౌంట్లపై ఫ్రీజ్ తొలిగించాలని కోరారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహిన పరిచే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. నిధుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.