- అక్కాచెల్లెళ్ల అత్యాచార ఘటనలో నిజాలు తేల్చిన పోలీసులు
- ఐదు రోజులు కల్లు దొరక్కపోవడంతో మానసిక రుగ్మతలు
- ఇద్దరిలో ఓ మహిళను లోబర్చుకున్న సెక్యూరిటీ గార్డ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గాంధీ హాస్పిటల్ రేప్ కేసును పోలీసులు ఛేదించారు. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ మందు కల్లుకు బానిసలై మానసిక రుగ్మతలకు గురైనట్లు గుర్తించారు. చెల్లెలును ఓ సెక్యూరిటీ గార్డ్ లోబరుచుకున్నాడని, ఈ క్రమంలోనే ఆమె పరువు పోతుందనే భయంతోనే పోలీసులకు గ్యాంగ్ రేప్ కంప్లయింట్ ఇచ్చినట్లు తేల్చారు. 11 రోజులుగా కనిపించకుండా పోయిన అక్కను గురువారం నారాయణగూడ పోలీసులు గుర్తించారు. హిమాయత్నగర్లోని ఓ మెడికల్ షాప్ వద్ద మహిళను అదుపులోకి తీసుకుని నార్త్ జోన్ పోలీసులకు అప్పగించారు. మహిళను లోబర్చుకున్న సెక్యూరిటీ గార్డ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను
వెల్లడించారు.
జరిగింది ఇదీ..
మహబూబ్నగర్కు చెందిన వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో ఈనెల 5న గాంధీలో ఇన్పేషెంట్గా చేరాడు. అతనికి సహాయకులుగా భార్య, ఆమె చెల్లెలు హాస్పిటల్ కు వచ్చారు. ఐదు రోజుల పాటు పేషెంట్ వద్ద ఉన్న ఇద్దరు మహిళల్లో అతడి భార్య ఈ నెల 8వ తేదీన హాస్పిటల్ నుంచి కనిపించకుండా పోయింది. ఆ రోజు నుంచి ఆమె చెల్లి ఒంటరిగానే హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో తిరిగింది. ఈ నెల11,14 వ తేదీల్లో రాత్రి అక్కడి సెక్యూరిటీ గార్డ్తో కలిసింది. మందు కల్లు అలవాటు ఉన్న ఆమె ఈ నెల 15న ఉదయం ఒంటిపై బట్టలు లేకుండా స్పృహ తప్పి గాంధీలో ఓ రూంలో కనిపించింది. హాస్పిటల్ సిబ్బంది సమాచారంతో ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు. పరువు పోతుందని భయపడిన చెల్లెలు తన మీద, తన అక్క మీద గ్యాంగ్రేప్జరిగిందని చిలుకలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీపీ అంజనీకుమార్ పర్యవేక్షణలో లా అండ్ ఆర్డర్, టాస్క్ఫోర్స్, ట్రాఫిక్, టెక్నికల్ ఇలా12 పోలీస్ టీమ్స్తో పూర్తిస్థాయిలో గాలించారు. 500కు పైగా సీసీటీవీ కెమెరాల్లో 800 గంటల ఫుటేజ్ పరిశీలించారు. గాంధీ హాస్పిటల్లోని సిబ్బంది,సెక్యూరిటీతో పాటు 200 మంది సాక్షులను విచారించారు. మహిళలు ఇద్దరు మత్తుకు బానిసలై మానసిక రుగ్మతలకు గురైనట్లు తేల్చారు. 11 రోజులుగా కనిపించకుండా పోయిన అక్క మత్తు కల్లు కోసం రోడ్ల వెంబడి తిరుగుతుండగా నారాయణగూడ పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ విచారించగా గ్యాంగ్రేప్ఆరోపణలు కట్టుకథే అని తేలింది.
ఉమామహేశ్వర్ మంచోడే
ల్యాబ్టెక్నీషియన్ ఉమామహేశ్వర్కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మహిళకు గాంధీలో ఉమామహేశ్వర్ రావు పేరు ఒక్కటే తెలుసని, అందుకే ఆయన పేరు ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గాంధీ హాస్పిటల్ అధికారులను అలర్ట్ చేస్తామని సీపీ అంజనీకుమార్ చెప్పారు.