బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాము పండించి తెచ్చిన కూరగాయలను అధిక బరువు నెపంతో 80 కిలోలకు 50 కిలోలే తూకం వేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టడంతో వారిని అరెస్ట్ చేశారు . తమను వ్యాపారులు, హమాలీలు, దళారీలు మోసం చేస్తున్నారని బుధవారం రైతుల ధర్నాకు పిలుపు నిచ్చిన వారిని పోలీసులు మార్కెట్ యార్డు వద్ద అరెస్టు చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు.
అరెస్ట్ కు ముందు రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలపడంతో మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ట్రాన్స్ పోర్ట్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలి: రైతులు
కూరగాయల బస్తా తూకం 50-65కిలోల మద్యలో ఉండడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. ఖాళీ బస్తా ఖరీదును సరుకు కొనుగోలు దారుడే భరించాలి అటూ వినతి పత్రాన్ని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖ అధికారికి అందించి శాంతి యుతంగా చర్చించడానికి వస్తున్న తమను అన్యాయంగా అడ్డుకున్నారని తెలిపారు .
సమన్యాయమంటూ హమాలీలకు లాభం రైతులకు నష్టం వచ్చే విదంగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని తమ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కూరగాయలు మార్కెట్ కు తేవడానికి అయ్యే ట్రాన్స్ పోర్ట్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కమీషన్ రైతుల దగ్గర కాకుండా కొనుగోలు దారుల నుండి వసూల్ చేయాలన్నారు. హమాలి చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేసి చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు.