- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరార్
- యాక్సిడెంట్ కేసులో కొడుకును తప్పించి ఎస్కేప్
- దుబాయ్లో మకాం పెట్టిన తండ్రీ కొడుకులు
- ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
- భారత్కు రప్పించి అరెస్ట్ చేసేందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్కి పారిపోయాడు. కొడుకు రాహిల్ అలియాస్ సాహిల్తో కలిసి గత నెల రోజులుగా దుబాయ్లో మకాం పెట్టాడు. రాష్ట్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. విదేశాల్లో విలాసాలు చేస్తున్న తండ్రీకొడుకుల కోసం పంజాగుట్ట పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇద్దరిపై లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్ఓసీ)జారీ చేశారు.
విదేశాల నుంచి రప్పించి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో గతంలో జరిగిన యాక్సిడెంట్ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్23న ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదం సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న షకీల్, సాహిల్కు సంబంధించిన వివరాలను వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్మంగళవారం వెల్లడించారు. వారిద్దరు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
పక్కా ప్లాన్తో ఉడాయించి..
రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ తన కుమారుడు సాహిల్ను పథకం ప్రకారం పోలీసులకు చిక్కకుండా దుబాయ్కి తరలించారని డీసీపీ చెప్పారు. ఈ కేసులో మొత్తం16 మందిని నిందితులుగా చేర్చి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సాహిల్ తప్పించుకునేందుకు సహకరించిన పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, బోధన్ సీఐ ప్రేమ్కుమార్లను ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు.
దుర్గారావును సోమవారం గుంతకల్లులో అరెస్ట్ చేసి రాత్రి న్యాయమూర్తి ముందు హాజరు పరిచామన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై దుర్గారావుకు బెయిల్ వచ్చిందని డీసీపీ తెలిపారు. షకీల్, సాహిల్ దుబాయ్కి పారిపోయినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, కాల్డేటా సహా టెక్నికల్ ఆధారాలు సేకరించినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని వివరించారు.
పాత కేసులో మళ్లీ ఇన్వెస్టిగేషన్..
2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో వారిపై అనేక మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. సరైన దర్యాప్తు చేయకుండానే పథకం ప్రకారం షకీల్కొడుకును తప్పించారనే ఆరోపణలు ఉన్నాయని, ఆ యాక్సిడెంట్లో నాలుగున్నరేండ్ల బాలుడు చనిపోయాడని చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. కాగా యాక్సిడెంట్జరిగిన సమయంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు మాత్రం డ్రైవర్ పారిపోయాడని చెప్పారు. వెహికిల్తో పాటు పూర్తి వివరాలు ఉన్నప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదని, ఆ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఫుట్పాత్పై షెల్టర్తీసుకునే వారు కావడంతో షకీల్ తన కొడుకును తప్పించారు. అతని స్థానంలో కింగ్ కోఠికి చెందిన మీర్జాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై మళ్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని డీసీపీ విజయ్కుమార్ తెలిపారు.