ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఇంకేదీ ఉండదేమో.ఈ ప్రేమ గురించి ఎన్ని సార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే ఎలాంటి లాభం ఆశించకుండా స్వఛ్చమైన ప్రేమను పంచేది ఒక్క అమ్మ మాత్రమే కావచ్చు.తన బిడ్డల కోసం తల్లి జీవితాన్ని ధార బోస్తుంది.పిల్లలు ఎలా ఉన్నా సరే తల్లి చూపించే అమితమైన ప్రేమను ఇంకెవరూ చూపించలేరేమో అనిపిస్తుంది.తనకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తన పిల్లల కోసం ఆమె పడే తపన అంతా ఇంతా కాదు. ఇక పిల్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే తన ప్రాణం అడ్డేసి అయినా సరే కాపాడుకుంటుంది.ఇక తల్లి ప్రేమలో మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ముందు వరుసలోనే ఉంటాయి.తమ పిల్లలకు ఎలాంటి ఆపద వచ్చినా లదేంటే ఎండ, వాన, చలి ఇలా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే తమ పిల్లల కోసం పడే కష్టం మాములుగా ఉండదనే చెప్పాలి.మనుషులు ఎలాగైనా తమ ప్రేమను పిల్లల మీద చూపిస్తారో అలాగే జంతువులు కూడా తమ స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఓ కుక్క తన పిల్లల కోసం ఆవేదన పడింది.
తన బిడ్డల కోసం తల్లి కుక్క ఆవేదనను గుర్తించిన పోలీసులు తల్లి కుక్క వద్దకు చేర్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరద నీటిలో కుక్క పిల్లలు చిక్కుకున్నాయి. అప్పుడు తల్లి కుక్క పడే ఆవేదన అంతా కాదు. అప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఉన్నారు. తన పిల్లలను కాపాడాలని పోలీసుల చుట్టూ.. వారి వాహనాల చుట్టూ ఆ తల్లి కుక్క తిరుగుతుంది. ఆ మూగజీవి ఆవేదనను గమనించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ రూరల్ అజిత వేజెండ్ల తమ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వగా.. వరదనీటిలో ఉన్న ఇంట్లో పిల్లలను గమనించిన పోలీసులు కుక్క పిల్లలను తల్లి కుక్క వద్దకు చేర్చి మానవత్వం చాటారు పోలీసులు. నోరు లేని జీవి తన బిడ్డల కోసం పడిన తాపత్రయం అక్కడ ఉన్న వారిని కట్టిపడేసింది.