పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి : కొత్త డీసీపీ రాజేశ్​ చంద్ర

పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి : కొత్త డీసీపీ రాజేశ్​ చంద్ర
  • ఏడాదిలోగా యాదాద్రి జోన్​లో మరింత మెరుగైన సేవలందిస్తాం..
  • మీడియా చిట్​చాట్​లో కొత్త డీసీపీ రాజేశ్​ చంద్ర

యాదాద్రి, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నా..  నేరవిచారణలో  కఠినంగా  ఉండాలని,   ప్రజాప్రతినిధులను పోలీసులు కలవడంలో తప్పేం లేదని  యాదాద్రి డీసీపీ రాజేశ్​ చంద్ర అన్నారు.  ఇటీవల   బదిలీపై వచ్చిన ఆయన భువనగిరిలోని తన కార్యాలయంలో  మంగళవారం మీడియాతో చిట్​చాట్ ​నిర్వహించారు.    ఎల్​బీ నగర్, మల్కాజ్​గిరి జోన్​ తరహాల్లో  యాదాద్రి జోన్​ను తీర్చిదిద్దుతామని  స్పష్టం చేశారు. సివిల్​, క్రిమినల్​ కేసుల విషయంలో పోలీసులు అలర్టుగా ఉండాలని,   భూ తగాదాల కేసుల్లో  రెండు వైపులా వాదనలను విన్న తర్వాతే ఎఫ్​ఐఆర్​ చేయాలని తెలిపారు.   

భయంలేకుండా స్టేషన్​కు రావొచ్చు.. 

పోలీసులు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తామన్నారు.  ఫిర్యాదులు చేయడానికి త్వరలోనే వాట్సాప్​ నంబర్ తెస్తామన్నారు.  ఎవరితో చెప్పించకుండా, భయంలేకుండా  ఫిర్యాదుదారులు నేరుగా పోలీస్​ స్టేషన్​కు వచ్చే వాతావరణం ఉంటుందని గుర్తు చేశారు. సంబంధిత ఆఫీసర్లు స్టేషన్​లో అందుబాటులో లేకుంటే ఫిర్యాదుదారులు స్టేషన్​లోని ఎంట్రీబుక్​లో వారి వివరాలు రాసి వెళ్లాలని, ఆఫీసర్లు వచ్చాక వారే కాల్​ చేస్తారని చెప్పారు. స్టేషన్​లో ఎవరినీ వెయిట్​ చేయించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. 

పొలిటీషియన్లను కలవడం తప్పేంకాదు.. 

యాదాద్రి జిల్లాకు బదిలీపై రాగానే డీసీపీ రాజేశ్​ చంద్ర.. మంత్రి  జగదీశ్​రెడ్డిని కలిశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా “గవర్నమెంట్​లో అన్ని విభాగాలు భాగం. మేము ఎగ్జామ్​ రాసి, ట్రైనింగ్​ తో వచ్చాం. రూల్స్​ ప్రకారం వెళ్తాం.  రూల్స్​ ఫ్రేమ్​  చేసే పొలిటీషియన్స్​ను ఇన్​వాల్వ్​ కావద్దని చెప్పలేం. ప్రజలు ఎన్నుకున్న వాళ్లను మేం కలవడం తప్పు లేదు. అయినా వాళ్లు చెప్పింది విని..  రూల్స్​ ప్రకారమే నడుచుకుంటాం” అని డీసీపీ బదులిచ్చారు. 

పోలీసులు బాధ్యతగా ఉండాలి.. 

ప్రజలతో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని, రూల్స్​ ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నా, క్రిమినల్స్​తో స్ట్రిక్ట్​ ఉండాలని చెప్పారు.  ఐపీసీ, సీఆర్​పీసీ, ఎవిడెన్స్​యాక్ట్​ను ఉపయోగంచుకోవాలని,   తప్పు చేస్తే దొరికిపోతామన్న భయమూ నేరస్తులకు కలగాలని అన్నారు.