డబ్బిస్తారు సరే ఇంతకీ పేదలెందరు?

డబ్బిస్తారు సరే ఇంతకీ పేదలెందరు?

ఎన్నికల వర్గాల్లో ముఖ్యమైనవి పేదరికాన్ని తరిమికొట్టే  ఫ్లాగ్ షిప్ పథకాలు. అధికార బీజేపీ పెద్ద కులాల్లో  పేదలకు 10 శాతం కోటా చట్టం తెస్తే, ప్రతిపక్ష కాంగ్రెస్ న్యూనతమ్ ఆయ్ యోజన’ (న్యాయ్) పర్కటించింది. పేదరికంపై పోరాటానికి ఏ పార్టీ  ఎన్ని పథకాలు తెచ్చినా, సరైన డేటా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ . ఈరెండు స్కీమ్ లపైనా ‘విల్ ’ అనే రీసెర్చ్ సంస్థ ఒక నివేదిక రిలీజ్ చేసింది.

పేదరికాన్ని  తరిమికొడతామని ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఫ్లాగ్ షిప్  స్కీమ్ లు  ప్రకటించాయి. బీజేపీ ఈ ఏడాది జనవరిలో పెద్ద కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొస్తే , కాంగ్రెస్ పార్టీ  తాజాగా ‘న్యూనతమ్ ఆయ్ యోజన  (న్యాయ్)’ ప్రకటించింది. ఈ స్కీంని కాంగ్రెస్ పార్టీ  తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. 2030లోగా దేశంలో పేదరికాన్ని పారదోలడంలో భాగంగా ‘న్యాయ్’ పథకాన్ని తీసుకువస్తున్నట్లు కాంగ్రెస్ చీఫ్ రాహుల్  గాంధీ చెప్పారు. దేశంలోని 5 కోట్ల  కుటుంబాలకు కనీస ఆదాయం లేదని, వారందరినీ ఆదుకోవడానికి ఒక్కో కుటుంబానికి  ఏడాదికి రూ.72,000 కనీస మొత్తం  సమకూరేలా చూస్తామని కాంగ్రెస్ పేర్కొంది.

ఈ పరిస్థితుల్లో రెండు ప్రధాన పార్టీల ఫ్లాగ్ షిప్  స్కీంలు రూట్ లెవెల్లో ఎంతవరకు ఆచరణీయం అనే ప్రశ్న తెర మీదకు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా  పేద గొప్ప తేడాలపై రీసెర్చ్ చేస్తున్న ‘వరల్డ్ ఇన్ ఈక్వాలిటి ల్యాబ్ (విల్)’ అనే  సంస్థ ఈ రెండు పథకాలపైనా స్టడీ చేసింది. దీనికి సంబంధించి ఓ రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేసింది. ‘న్యాయ్’ పథకం బాగా ఖర్చుతో కూడుకున్నదని ‘విల్’ సంస్థ  రీసెర్చ్ ఫెలో నితిన్ భార్తీ చెప్పారు. అయితే పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవడానికి అనేక మార్గాలున్నాయన్నారు.  ఈ సందర్భంగా ‘ప్రొగ్రెసివ్  ట్యాక్సేషన్’ని రిపోర్ట్ లో ‘విల్’ ప్రస్తావించింది. ఆదాయంపై ‘ప్రొగ్రెసివ్  ట్యాక్సేషన్’ వేయడం వల్ల పథకానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవచ్చని ఈ అంతర్జాతీయ సంస్థ సూచించింది. మిగతా సంక్షేమ పథకాలకు అదనంగా ‘న్యాయ్’ను  అమలు చేయాలని రిపోర్ట్  పేర్కొంది. అంతే తప్ప ‘న్యాయ్’ పథకం అమలు చేస్తున్నాం కదా అని మిగతా వెల్ఫేర్ స్కీమ్ లను పక్కన పెట్టకూడదని ‘విల్’ రిపోర్ట్  తేల్చి చెప్పింది. అలాగే పన్నుల విధానంలో మార్పులు రావాల్సిన  అవసరం ఉందన్నారు ఆర్ధికవేత్త భార్తీ. ట్యాక్సేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన  అవసరం ఉందన్నారు. పన్నుల విధానంలో మార్పులు  చేయడం ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని ‘న్యాయ్’ పథకానికి మళ్లించాలన్నారు.‘న్యాయ్’ సహా  ఏ పథకం లక్ష్యమైనా దేశంలో డబ్బులున్నవారు, పేదల మధ్య అంతరాలు తొలగించడమే కావాలన్నారు. కాంగ్రెస్ చెప్పే కనీస ఆదాయ పథకం దీనికి కొంత మేరకు ఉపయోగపడగలదన్నారు.

ఈడబ్ల్యూఎస్ కోటాపై …

ఎన్డీయే సర్కార్  తీసుకువచ్చిన 10 శాతం కోటా చట్టంపై  ‘విల్’ సంస్థ  సంచలన కామెంట్స్ చేసింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే కేంద్రం ఈ చట్టాన్ని చేసిందన్న అభిపారయం కలుగుతోందని ‘విల్’ సంస్థ   రిలీజ్ చేసిన రిపోర్ట్  పేర్కొంది. పెద్ద కులాల్లోని పేదలకు సామాజిక నాయ్యం కల్పించాలన్న లక్ష్యం చట్టంలో ఎక్కడా కనపడటం లేదని కామెంట్ చేసింది. కోటా అమలు కావాలంటే ఏడాది ఆదాయం ఎనిమిది లక్షలు దాటకూడదన్న నిబంధనను ఈ సందర్భంగా రిపోర్ట్  ప్రస్తావించింది.  పేదల కోటా సమర్ధంగా అమలు కావాలంటే వ్యవసాయ భూమి గరిష్ట పరిమితిని ఐదెకరాలు కాకుండా 0.4 ఎకరాలుగా నిర్ణయించి  ఉండాల్సిందని అభిప్రాయ పడింది.

పేదరికంపై పోరాటం చేయడానికి ఏ పార్టీ  ఎన్ని పథకాలు తీసుకువచ్చినా, అందుకు సంబంధించి సరైన డేటా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ గాతయారైందంటున్నారు  ఆర్ధిక నిపుణులు. దేశంలో ఏయే రంగాల నుంచి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఆదాయం వస్తుందనే దానిపై స్పష్టమైన  డేటాలేదన్నది‘విల్’ అభిప్రాయం. దీంతో పథకం వల్ల ప్రయోజనం లబిద్దారులు ఎవరన్న దానిపై సర్కార్లకు ఒక క్లారిటీ రావడం లేదని నిపుణులు భావిస్తున్నారు.

కాంగ్రెస్  స్కీం ‘న్యాయ్’

’కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రకటించిన ‘న్యూనతమ్ ఆయ్ యోజన  ’ ఓ ఫ్లాగ్ షిప్ పథకం. ఈ పథకం ద్వారా ఒక్కో పేద కుటుంబానికి నెలకు రూ. ఆరు వేలు అందుతాయి. మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఈ అమౌంట్  నేరుగా జమఅవుతుంది. ‘న్యాయ్’ పథకం దశల వారీగాఅమలవుతుంది. మొదటి ఏడాదిలో పథకం ఖర్చు ‘స్థూల  జాతీయోత్పత్తి (జీడీపీ)’లో ఒక శాతం కన్నా తక్కువగా ఉంటుంది. 1971లో రెండోసారి అధికారంలోకి రావడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా పేదరికంపై పోరాటాన్నే ఆయుధంగా చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ‘గరీబీ హఠావో’ నినాదం  ప్రజల్లోకి దూసుకెళ్లింది.  తాజాగా పార్టీ మేనిఫెస్టో లో చేర్చిన‘న్యాయ్’ పథకం కూడా ప్రజలను ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

బీజేపీ 10 శాతం కోటా

పెద్ద కులాల్లోని  పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏడాదికి ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్నవారే ఈ పథకానికి అర్హులని కేంద్రం స్పష్టం  చేసింది.అలాగే  వ్యవసాయ భూమి ఐదెకరాలకు మించకూడదని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ ఆధారంగా సామాజికంగా,విద్యాపరంగా వెనకబడ్డ  వర్గాలకు విద్య, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించడానికి రిజర్వేషన్ల అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు కూడా రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాలని కోటా పరిధిలోకి రాని కులాల్లోని  పేదలు ప్రభుత్వాలను కోరుతున్నారు. దీంతో ‘ఎకనమికల్లీ  వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్)’కి  నాయ్యం చేయడానికి10 శాతం కోటా బిల్లును తీసుకువచ్చింది