
- మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది
- 167 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్.. వీళ్లలో 38 మందికి సీరియస్
- కిష్త్వార్ జిల్లాలోని చోసిటీ గ్రామాన్ని ముంచెత్తిన వరద
- గల్లంతైన వారిలో మచైల్ మాతా యాత్రికులు
- కొనసాగుతున్న సహాయక చర్యలు.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్
- యాత్రను నిలిపివేసిన అధికారులు
- రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి
జమ్మూ: జమ్మూకాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరద బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో పెద్ద ఎత్తున వరద వచ్చింది. కొండల పైనుంచి భారీగా వచ్చిన వరద.. కిష్త్వార్ జిల్లాలోని ఛోసిటీ గ్రామాన్ని ముంచెత్తింది. సెక్యూరిటీ అవుట్ పోస్టు సహా ఇండ్లు, షాపులను నామరూపాల్లేకుండా చేసింది. ప్రముఖ మచైల్ (చండీ) మాతా యాత్రకు ఈ ఊరే బేస్ పాయింట్ కావడంతో.. గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా వరద రావడంతో వందల సంఖ్యలో గల్లంతయ్యారు.
ఈ ఘటనలో 38 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. 120 మందిని కాపాడామని, వారిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ విపత్తు కారణంగా మచైల్ మాతా యాత్రను అధికారులు నిలిపివేశారు. జులై 25న మొదలైన ఈ యాత్ర.. సెప్టెంబర్ 5న ముగియాల్సి ఉంది.
రంగంలోకి రెస్క్యూ టీమ్స్..
కిష్త్వార్ టౌన్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోసిటీ గ్రామం.. మచైల్ (చండీ) మాతా యాత్రకు బేస్ పాయింట్. భక్తులు తమ వాహనాలను ఇక్కడే ఉంచి, 8.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి.. 9,500 అడుగుల ఎత్తులో ఉన్న చండీ మాతా ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల కోసం ఈ ఊర్లోనే లంగర్ (కమ్యూనిటీ కిచెన్) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి వర్షం కురిసింది. ఒక్కసారిగా కొండల పైనుంచి వచ్చిన భారీ వరద ఊరును ముంచెత్తింది. ఆలయానికి వెళ్లేందుకు అప్పటికే అక్కడికి చేరుకున్న వందలాది మంది భక్తులు, స్థానికులు వరదలో గల్లంతయ్యారు.
ఇండ్లు, షాపులు, కమ్యూనిటీ కిచెన్ కొట్టుకుపోయాయి. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు పోలీస్, ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు 20 మందికి పైగా డెడ్బాడీలను వెలికితీశారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ‘‘పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాం. ఇప్పటివరకు 120 మందిని కాపాడాం. వారిలో 38 మంది కండీషన్ సీరియస్గా ఉంది” అని వెల్లడించారు.
అవసరమైన సాయమందిస్తం: ప్రధాని మోదీ
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘కాశ్మీర్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తం” అని ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
‘‘వరదలో గల్లంతైనోళ్లను, శిథిలాల కింద చిక్కుకున్నోళ్లను కాపాడేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాం. ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించాను. ఎలాంటి సాయం అవసరమైనా అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు” అని ఎల్జీ మనోజ్ సిన్హా తెలిపారు.