- బీఆర్ఎస్అసంతృప్తులకు కాంగ్రెస్గాలం
- ఎమ్మెల్యే మైనంపల్లి చేరికతో జోరు పెంచిన హస్తం నేతలు
- టికెట్ రాని ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి లీడర్లతోనూ చర్చలు
- కాంగ్రెస్లో చేరాలంటూ గులాబీ నేతలతో సంప్రదింపులు
హైదరాబాద్, వెలుగు : త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుండ గా.. గ్రేటర్ హైదరాబాద్లో పొలిటికల్ సీన్ మారుతుంది. బీఆర్ఎస్ అసంతృప్తులకు కాంగ్రెస్గాలం వేస్తుంది. గులాబీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇప్పటికే మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, తన మద్దతుదారులతో కాంగ్రెస్లో చేరారు.
దీంతో మరికొందరు సిట్టింగ్ టికెట్ దక్కని గులాబీ ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలను సైతం హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వారితో కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలు సంప్రదింపులు చేస్తున్నారు. బీఆర్ఎస్నుంచి పెద్దసంఖ్యలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ లో అధిక సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మైనంపల్లి బాటలో ఇంకొందరు..
కాంగ్రెస్ ఇచ్చే ఆఫర్లకు కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా స్పందిస్తున్నట్టు సమాచారం. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్లో చేరి తను కోరుకున్నట్టుగా రెండు సీట్లను ఇచ్చేలా హామీపొందారు. తాజాగా ఆయన బాటలోనే మరికొందరు గులాబీ ప్రజా ప్రతినిధులు కూడా హస్తం గూటికి చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తుంది. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాశ్రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకుండా బండారు లక్ష్మారెడ్డిని అధిష్టానం ప్రకటించింది. దీంతో సుభాశ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉండగా.. తమ పార్టీలోకి రావాల్సిందిగా ఇప్పటికే కాంగ్రెస్నేతలు ఆయనకు సంకేతాలు ఇచ్చారు. ఆయన కూడా చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ఎమ్మెల్యే వివేకానందకు టికెట్ఖరారైంది. దీంతో అదే సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ శంభీపూర్రాజుతో మనస్పర్థలు వచ్చాయి. మరోవైపు నియోజకవర్గంలోని కొందరు గులాబీ సీనియర్లు వివేకానందను వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాజును కూడా కొందరు కాంగ్రెస్ముఖ్యనేతలు సంప్రదించినట్టు తెలిపింది. అంబర్పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు ఈసారి టికెట్ఇవ్వొద్దంటూ సెగ్మెంట్ కు చెందిన పలువురు పార్టీ సీనియర్నేతలు అసమ్మతి వ్యక్తం చేశారు. అయినా కేసీఆర్ ఆయననే ప్రకటించడంతో చాలామంది ద్వితీయశ్రేణి గులాబీ నేతలు కార్యకర్తలు కాలేరుపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ముషీరాబాద్ సిట్టింగ్ఎమ్మెల్యే ముఠా గోపాల్పై పార్టీ నేతల అసంతృప్తి సెగలు తగ్గడంలేదు. నియోజకవర్గంలోని సీనియర్ నేత ఎంఎన్ శ్రీనివాస్ చాలాకాలంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన టీడీపీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతల పిలుపు మేరకు పార్టీలో చేరారు. కానీ ఇప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది.
దీంతో హస్తం నేతలు ఆయనను కూడా పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. గోషామహల్నుంచి బీజేపీ తరపున పోటీచేయాలని ప్రయత్నిస్తున్న దివంగత మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడుకు విక్రమ్గౌడ్ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఇలా సిటీలోని ప్రధాన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసంతృప్తు నేతలను తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.
అధిక సీట్లే లక్ష్యంగా..
గ్రేటర్లో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్నేతలు ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను, నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కీలకమైన ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట, సనత్నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్వంటి చోట్ల పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
పాతబస్తీలోనూ జెండా ఎగుర వేసేందుకు, ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత చెప్పారు. అందుకే ఆకర్ష్ మంత్రాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈసారి కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, అధికారంలోకి తామే రానున్నామన్న ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.