రంగారెడ్డి జిల్లా, వెలుగు: భానుడి భగభగలకు గ్రేటర్లో విద్యుత్ వినియోగం పెరిగి తగ్గింది. అయితే ఏప్రిల్ మొదటి వారంలో విద్యుత్ డిమాండ్ 64 ఎంయూలకు చేరగా, 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 56 ఎంయూలకు పడిపోయింది. ప్రస్తుతం విద్యుత్ వినియోగం 58 ఎంయూలకు చేరింది. ఐదురోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో తిరిగి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఇలాగే పెరుగుతూ పోతే ఏప్రిల్ నెలాఖరుకు 65 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మే, జూన్ నెలల్లో సుమారుగా 70 ఎంయూలకు చేరే అవకాశం లేకపోలేదని ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గతేడాది మేలో నమోదైన విద్యుత్ వినియోగం ఈసారి మార్చి మూడో వారం నుంచే ప్రారంభమైంది. ఎండలు పెరిగితే వినియోగం పెరుగుతోందని టీఎస్ పీడీసీఎల్ ఆపరేషన్స్ అధికారులు చెబుతున్నారు.
గతేడాది మే 29న 62.83 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం నమోదవ్వగా ఈసారి ఆ వాల్యూ ఏప్రిల్ లోనే దాటింది. దీంతో అదనపు డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవికాలం పూర్తయ్యే వరకు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
