ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 

చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన మిశ్రా 1964 ఆగస్టు 29వ తేదీన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ లో జన్మించారు. బిలాస్ పుర్ లోని గురుఘసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ లోని హైకోర్టులో  2005 జనవరిలో సీనియర్ న్యాయవాది హోదా పొంది బార్ కౌన్సిల్ చైర్మన్ గానూ పనిచేశారు. అటు తర్వాత హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యులుగా, రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ గా, అడ్వకేట్ జనరల్ గా సేవలందించారు. 2009లో డిసెంబర్ 10వ తేదీన ఛత్తీస్ గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై.. తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తూ.. బదిలీపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వచ్చారు.