మ‌రో మూగ‌జీవిపై దారుణం.. ఆవు నోట్లో పేలిన బాంబ్

మ‌రో మూగ‌జీవిపై దారుణం.. ఆవు నోట్లో పేలిన బాంబ్

కేర‌ళ‌లో గర్భంతో ఉన్న ఏనుగుకు బాణ‌సంచా కూర్చిన పండు ఇవ్వ‌డంతో అది మ‌ర‌ణించిన ఘ‌ట‌నపై ప్ర‌ముఖులు నుంచి సామాన్యులు వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రూ ఖండించారు. ఆ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వాళ్లు మ‌నుషులే కాద‌ని, వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గానే… హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో అచ్చం అలాంటి ఘ‌ట‌నే మ‌రోక‌టి జరిగింది. గర్భంతో ఉన్న ఓ ఆవు నోటిలో బాంబు పేలింది. బిలాస్‌పూర్‌లోని ఝాందూత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. పొలంలోని గడ్డిలో దాచిన పేలుడు పదార్థాన్ని తిన‌డంతో ఆవు దవడలు మొత్తం పగిలి.. నోటి నుంచి వేలాడుతున్నాయి.

ఆవు యజమాని గురుదయాళ్ సింగ్ ఈ దారుణంపై మాట్లాడుతూ….తన ఇంటి పొరుగున ఉన్న నందలాల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడదని ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత నందలాల్ పారిపోయాడని తెలిపాడు. ప‌ది రోజుల క్రితం ఈ ఘటన జరిగింద‌ని చెప్పాడు. ఈ ఘటనకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. త‌న‌కు న్యాయం చేయాల‌ని తెలిపాడు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.