
హూజూరాబాద్ వెలుగు: వారు పిల్లల కోసం ఎంతోకాలం ఎదురు చూశారు. ఎన్నో కలలు కన్నారు. చివరకు స్కానింగ్లో కవల పిల్లలు ఉన్నట్లు తేలడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కానీ ఇంతలోనే ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమెతోపాటూ కడుపులోని ఇద్దరు కవలలూ చనిపోయారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన జూపాక కనకయ్య, సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన స్వరూప(38)లకు 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. పిల్లల కోసం అనేక పద్ధతుల్లో వారు ప్రయత్నాలు చేశారు. వరంగల్ జిల్లాలోని ఓ ఐవీఎఫ్సెంటర్లో వైద్యంతో ఎనిమిది నెలల కిందట స్వరూప గర్భం దాల్చింది. తమ కలలు సాకారం కాబోతున్నాయని ఆ కుటుంబం ఆనందంలో మునిగితేలింది. 8 నెలలు నిండటంతో స్వరూప ఇటీవలే ఎలబోతారంలోని తన పుట్టినింటికి వెళ్లింది. గురువారం చాతిలో నొప్పిగా ఉందంటూ భర్తకు చెప్పగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. బీపీ ఎక్కువగా ఉండటంతో పాటు పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు తరలించే క్రమంలోనే స్వరూప మృతిచెందింది. కనీసం పిల్లలనైనా బతికించాలని కనకయ్య డాక్టర్లను ప్రాథేయపడ్డారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు స్వరూపకు ఆపరేషన్ చేశారు. అయితే అప్పటికే కవలలు మృతిచెందారు.