- విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్టు అధికారుల వెల్లడి
- వేసవిలో ఇబ్బందులు రాకూడదనే ఫీడర్ల మరమ్మతులు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్పరిధిలో ఈ సారి వేసవిలో ఎండల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందువల్ల విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే ఫీడర్ల మరమ్మతు పనులు మొదలెట్టారు. కొన్ని రోజులుగా సమ్మర్ ప్రిపరేషన్ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది టైమ్ కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. గ్రేటర్పరిధిలో 3 వేలకు పైగా11 కెవీ ఫీడర్లు ఉన్నాయి. వీటి ద్వారానే నిత్యం డొమెస్టిక్ వినియోగదారులకు విద్యుత్సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజుకు 100 నుంచి 120 ఫీడర్లను తనిఖీలు చేసి అవసరమైన రిపేర్లు చేస్తున్నారు.
పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు సమాచారం ఇచ్చి కొంత సమయం పాటు విద్యుత్సరఫరా నిలిపివేస్తున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ మెట్రోజోన్ చీఫ్ ఇంజనీర్ లక్ష్మీనర్సింహులు తెలిపారు. సమ్మర్ ప్రిపరేషన్ ద్వారా వేసవికి ముందు ఫీడర్లను పరిశీలించడం, ఫీడర్లు ట్రిప్ అయితే సరిదిద్దడం, ఆయా ప్రాంతాల్లో విద్యుత్ తీగలపై పెరిగిన చెట్లను కొట్టి వేయడం లాంటి పనులు చేపడుతున్నారు. ఇలాంటి పనులు చేసే సమయంలో కొద్దిటైం కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
ఈసారి భారీగా పెరగనున్న వాడకం
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వేసవిలో విద్యుత్వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఏప్రిల్, మే నెలలో రోజుకు గరిష్ఠంగా 79 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే గరిష్ఠంగా 22 నుంచి 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఈ సారి ఫిబ్రవరి నెల ప్రారంభానికే ఎండ వేడిమి ప్రారంభం కావడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించగా..
ప్రస్తుతం 21 నుంచి 22 మిలియన్ యూనిట్ల వరకు వాడే అవకాశం ఉంది. ఈ సారి గ్రేటర్ పరిధిలో 80 నుంచి 90 మిలియన్ యూనిట్లు దాటిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం కొత్త కనెక్షన్లు పెరగడమేనని అంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్పరిధిలో మూడు జిల్లాల్లో కలిపి రూ.18 లక్షల ఎల్టీ కనెక్షన్లు (డొమెస్టిక్) ఉండగా, మరో నాలుగు లక్షల వరకు కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి.
భారీగా విద్యుత్ వినియోగిస్తే ఫీడర్ల పై లోడ్ పెరుగుతుంది. పలు సందర్భాల్లో ట్రిప్కావడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. తిరిగి వాటిని సరిదిద్దడానికి కొంత సమయం పడుతుంది. మొత్తానికి గతేడాది కంటే ఈసారి విద్యుత్ వినియోగం మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువగానే వినియోగించే అవకాశం ఉంది.