
శామీర్ పేట, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల 18 న హైదరాబాద్ రానున్నారు. ఈ నేప థ్యంలో మల్కాజ్గిరి జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు మంగళ వారం కలెక్టరేట్లో డీసీపీ శబరీష్ , అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారని, అక్కడ నుంచి బొల్లారంకు రోడ్డు మార్గాన వెళ్తారని అధికారులకు వివరించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని, ప్రెసిడెంట్ హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమీక్షలో అధికారులు హరిప్రియ, రాజేశ్ కుమార్, శ్యామ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.