
జోయెల్ మోకిర్, అఘియన్, పీటర్ హోవిట్లకు పురస్కారం
రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన
స్టాక్హోమ్: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ముగ్గురికి దీనిని అందించనుంది. ఇన్నోవేషన్ ఆధారిత ఎకనామిక్ గ్రోత్, కొత్త టెక్నాలజీలు పాత వాటిని ఎలా భర్తీ చేస్తాయో అనే అంశాలపై చేసిన పరిశోధనలకు జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ లు ఈ అవార్డును అందుకోనున్నారు.
11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల బహుమతిలో సగం మోకిర్ కు వెళ్లనున్నది. మిగిలిన సగం ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ లకు దక్కుతుందని కమిటీ తెలిపింది. ‘క్రియేటివ్ డిస్ట్రక్షన్’ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతాన్ని వివరించినందుకు అఘియన్, హోవిట్లకు నోబెల్ ప్రకటించింది.
ట్రేడ్ వార్ మంచిది కాదు: అఘియన్
డచ్లో జన్మించిన జోయెల్ మోకిర్ (79) అమెరికన్, ఇజ్రాయెలీ సైంటిస్ట్. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. ఫ్రాన్స్ కు చెందిన ఫిలిప్ అఘియన్ (69) కాలేజ్ డి ఫ్రాన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యార్థులకు బోధిస్తున్నారు. కెనడాలో జన్మించిన హోవిట్ (79) బ్రౌన్ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. నోబెల్ పురస్కారం లభించడంతో తాను ఆశ్చర్యపోయానని మోకిర్ తెలిపారు.
దీనిని గెలుచుకోవడం కంటే పోప్గా ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువంటూ గతంలో ఆయన తన విద్యార్థులతో చమత్కరించారు. ప్రస్తుత ట్రేడ్ వార్లు వరల్డ్ గ్రోత్, ఇన్నోవేషన్లకు మంచిదికాదని సూచించారు. కాగా, నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారంతో ముగిసింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.