నాలుగు లేదా ఆరు నెలల నుంచి కాస్త గట్టి పదార్థాలు తిని అరిగించుకుంటారు పిల్లలు. కానీ, వాళ్లకు కడుపు నొప్పి వస్తుందేమో, తింటే అరుగుతుందో లేదో అని ఆరు నెలలు దాటినా సాలిడ్ ఫుడ్స్ పెట్టరు. కానీ, నిజానికి పిల్లలకు ఆరు నెలల నుంచే అన్నిరకాల సాలిడ్ ఫుడ్ పెడితేనే ఫ్యూచర్లో ఎలాంటి ఫుడ్ ఎలర్జీలు రావు అంటున్నారు పోషకాహార నిపుణులు.
పిల్లలు కాస్త కూర్చోగలిగినప్పుడు..తలను నిలపగలిగినప్పుడు..సాలిడ్ ఫుడ్స్ పెట్టడానికి సరైన టైం అని అర్థం. అప్పుడు పాలు, ఉగ్గుతో పాటు గట్టి పదార్థాలు కూడా అలవాటు చేయొచ్చు. అయితే అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ప్రకారం..కొత్త రకం ఫుడ్ పిల్లలకు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక రకం పెడుతున్నప్పుడు, మూడు రోజుల వరకు ఇంకో కొత్త ఐటమ్ పెట్టొద్దు. ఆ రెండు, మూడు రోజుల్లో ఏమైనా ఎలర్జీలు వస్తున్నాయో.. లేదో.. గమనించాలి. అలాగే మొదట పప్పు దినుసులు, తర్వాత పండ్లు, కూరగాయలు పెట్టడం మంచిది.
గుడ్లలో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. గుడ్లను బాగా ఉడికించి, మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలి. కావాలంటే అలా మెదిపిన గుడ్డులో తల్లి పాలు కలిపి తినిపించొచ్చు.
పిల్లలకి గుడ్డు లోపలి పచ్చసొన పెట్టొద్దని, తెల్లసొన పెట్టొద్దని అంటుంటారు.ఇవేమీ పట్టించుకోకుండా గుడ్డు మొత్తం తినిపించడం మంచిది. ఇలా చేస్తే పిల్లలకు అన్ని రకాల పదార్థాలు అలవాటవుతాయని చెప్తున్నారు పిడియాట్రిషియన్లు.