బంగ్లాలో పాక్ కూల్చిన గుడిని ప్రారంభించిన రామ్‌నాథ్

బంగ్లాలో పాక్ కూల్చిన గుడిని ప్రారంభించిన రామ్‌నాథ్

ఢాకా: యాభై ఏండ్ల కిందట 1971 బంగ్లాదేశ్​ యుద్ధంలో పాకిస్తాన్​ కూల్చేసిన ఢాకా శ్రీ రమణ కాళీ ఆలయాన్ని మన ప్రెసిడెంట్​ రామ్​నాథ్​ కోవింద్​ శుక్రవారం ప్రారంభించారు. బంగ్లాదేశ్​ ప్రెసిడెంట్​ ఎం.అబ్దుల్​ హమీద్  ఆహ్వానం మేరకు కోవింద్​ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. బంగ్లా ఇండిపెండెన్స్​ గోల్డెన్​ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ టూర్​లో భాగంగా ఇటీవల పునరుద్ధరించిన శ్రీరమణ కాళీ ఆలయాన్ని కోవింద్​ ప్రారంభించారు. అంతకుముందు తన భార్య, ఫస్ట్​ లేడీ సవితా కోవింద్​తో కలిసి పూజలు చేశారు. తర్వాత బంగ్లాదేశ్​లోని ఇండియన్లను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా, బంగ్లాదేశ్​ కల్చరల్​, స్పిరిచువల్​ బంధానికి ఈ చారిత్రక ఆలయం చిహ్నమని కోవింద్​ అన్నారు. కాళీమాత ఆశీస్సుల వల్లే గుడిని ప్రారంభించే గొప్ప గౌరవం దక్కిందన్నారు. లిబరేషన్​ వార్​ సందర్భంగా పాకిస్తాన్​ చేతిలో ధ్వంసమైన ఆలయాన్ని బాగుచేసేందుకు ఇండియా, బంగ్లాదేశ్​ ప్రభుత్వాలు, ప్రజలు సహకరించాయని తనకు తెలిసిందన్నారు. పాకిస్తాన్​ ఆక్రమణల్లో జనం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.