న్యూఢిల్లీ: ఇండియన్ స్పోర్ట్స్లో స్వర్ణ యుగం మొదలైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్టులకు శనివారం తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. మెగా ఈవెంట్లో ఇండియా అథ్లెట్లు 22 గోల్డ్ సహా 61 మెడల్స్తో 4వ స్థానంలో నిలిచారు. పతక విజేతలను సన్మానించిన మోడీ మాట్లాడుతూ కామన్వెల్త్లో ఇండియా పెర్ఫామెన్స్ను కేవలం పతకాలతోనే అంచనా వేయలేమన్నారు.
‘మన అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. చాలా పోటీల్లో ఒక సెకన్ లేదా ఒక సెంటీ మీటర్ తేడాతో వెనకబడ్డారు. మున్ముందు దాన్ని కూడా అధిగమిస్తారన్న నమ్మకం నాకుంది. మన యువశక్తికి ఇది ప్రారంభం మాత్రమే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, సమగ్రమైన, చైతన్యవంతమైన క్రీడా వ్యవస్థను రూపొందించే బాధ్యత మాపై ఉంది. ఏ ఒక్క ప్రతిభావంతుడిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్లు మన ఆస్తి’ అని మోడీ పేర్కొన్నారు.
ఇండియా బలంగా ఉన్న క్రీడలతో పాటు కామన్వెల్త్లో లాన్ బౌల్స్ వంటి కొత్త క్రీడల్లో కూడా పతకాలు రావడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఇవి కొత్త క్రీడలపై యువతలో ఉత్సాహాన్ని పెంచుతాయన్నారు. ఇక, హర్మన్ప్రీత్ కెప్టెన్సీలో విమెన్స్ టీ20 టీమ్ క్రికెట్లో అద్భుతంగా ఆడిందన్నారు. పేసర్ రేణుకా సింగ్ తన స్వింగ్ బౌలింగ్తో టోర్నీలో టాప్ వికెట్ టేకర్గా నిలవడం సాధారణ విషయం కాదన్నారు.
ఇండియా తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన చెస్ ఒలింపియాడ్లో పతకాలు నెగ్గిన చెస్ ప్లేయర్లను కూడా మోడీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. అదే సమయంలో ప్రధానికి అథ్లెట్లు పలు జ్ఞాపికలు అందజేశారు. తెలంగాణ యంగ్ బాక్సర్ నిఖత్.. కామన్వెల్త్ ఫైనల్లో ఉపయోగించిన తన గ్లౌజులను మోదీకి ఇచ్చింది. పారా టీటీ ప్లేయర్ భవీనా పటేల్ తన రాకెట్, జావెలిన్ త్రోయర్ అన్ను రాణి జావెలిన్ను ఇవ్వగా.. తాము సంతకాలు చేసిన ఇండియా జెర్సీని రెజ్లర్లు మోదీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, అధికారులు పాల్గొన్నారు.
క్యాష్ రివార్డులు ఇచ్చిన ఐఓఏ
కామన్వెల్త్ మెడలిస్టులను సన్మానించిన ఇండి యన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) వారికి క్యాష్ రివార్డులు అందజేసింది. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్మెడలిస్ట్లకు వరుసగా రూ. 20 లక్షలు, 10 లక్షలు, 7.5 లక్షల చెక్లను ఐవోఏ తాత్కాలిక అధ్యక్షుడు అనిల్ ఖన్నా అందజేశారు.