ఈ మధ్య కాలంలో యాభై ఏండ్లు రాగానే నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది. అయితే, మొదటినుంచి కొన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయడం వల్ల శరీరం దృఢంగా, బ్యాలెన్సింగ్గా తయారై, ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. నడుము, తొడ, పాదాల్లో ఉన్న కండరాల్లో బలం పెరిగి దృఢంగా తయారవుతాయి. అందుకు ఏంచేయాలంటే, బ్యాలెన్స్ ట్రైనింగ్కి వాడే బోసు బాల్ తీసుకొని దాని మధ్యలో కుడికాలు ఉంచి, ఒంటి కాలిపైన నిల్చోవాలి. తరువాత శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ కుడికాలు తరువాత ఎడమకాలితో కూడా చేయాలి. బోసు బాల్తో చేసినట్టుగానే దిండుతో కూడా బాడీ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. శరీరం బ్యాలెన్సింగ్ కోసం గోడ లేదా టేబుల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఐదు నిమిషాలు కుడి కాలితో, ఐదు నిమిషాలు ఎడమకాలితో స్కిప్పింగ్ చేయాలి.
ఇలా ఒంటి కాలితో స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో ఉన్న అన్ని కండరాలు కదిలి శరీరం దృఢంగా తయారవుతుంది. ప్లాంక్ విత్ ఫ్లయింగ్ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు ప్లాంక్ లేదా పుష్ అప్ పొజిషన్లోకి రావాలి. తరువాత కుడిచేతిని ముందుకు చాపి ఎడమచేతిపై బాడీ బ్యాలెన్స్ ఉంచాలి. అలానే కొంతసేపయ్యాక కుడిచేతిని మార్చి ఎడమచేతితో కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముక, పొత్తి కడుపులో కండరాలు బలంగా ఉంటాయి. స్క్వాట్స్ ఎక్సర్సైజ్... అంటే జంపింగ్ ఎక్సర్సైజ్. గాల్లోకి ఎగిరి, చేతులు కాళ్లను ఫ్రీ చేసి కిందికి దూకాలి. స్క్వాట్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కీళ్లలో ఒత్తిడి పెరిగి, వాటికి ఎక్సర్సైజ్ జరుగుతుంది.