హైదరాబాద్: జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ కు, వైసీపీ నాయకులకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకీ మరింత ఎక్కువవుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం నుంచి కొందరు గుర్తు తెలియని దుండగులు నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్లు విసిరేంత స్థాయికి ఈ గొడవ ముదిరింది. ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. పోసాని ఇంటిపై దాడిని ఖండించిన నట్టి కుమార్.. ఎవరైనా సరే, కుటుంబాలను నిందించడం సరికాదన్నారు.
డబుల్ గేమ్ ఆడుతున్నరు
‘పవన్ కల్యాణ్తో సినిమాలను తీస్తున్న కొందరు నిర్మాతలు ఆయనకు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన అలా మాట్లాడారు. సినీపరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు.. ఏపీ మంత్రి పేర్ని నానిని కలసి వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడిన విషయాలను స్పష్టంగా పరిశ్రమకు తెలియజేయకపోవడం కూడా అనేక అపోహలకు దారితీసింది. అక్కడ ఏం మాట్లాడారన్నది పరిశ్రమ నుంచి వెళ్లిన ఆ పెద్ద మనుషులు బయటకు వెల్లడించకపోగా.. పవన్ను రెచ్చగొట్టేలా డబుల్ గేమ్ ఆడారు. దీంతో పవన్ మాట్లాడిన మాటలు వివాదమయ్యాయి. రాజకీయాల గురించి పవన్ ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ పెద్ద స్టార్ అయిన ఆయన సినీ రంగం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవిక విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. పవన్తో సినిమాలు తీస్తున్న ఆ పెద్ద మనుషులే మళ్లీ మంత్రి పేర్ని నాని వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. పవన్ వారిని పంపించినట్లు బయట వదంతులు వినిపిస్తున్నాయి. దీన్ని పవన్ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఆ నిర్మాతల డబుల్ గేమ్ను సమర్థిస్తారా? లేదా అన్నది ఆయనే తేల్చుకోవాలి.
ఫ్యాన్స్ను పవన్ అదుపులో పెట్టుకోవాలె
‘నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ సమయంలో పోసాని అక్కడ ఉంటే చంపేసేవారేమో. అందుకే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, వారిపై హత్యా ప్రయత్నం కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పవన్ కుటుంబాన్ని ఉద్దేశించి పోసాని మాట్లాడటం కూడా తప్పే. ఎవరూ ఎలాంటి గొడవలు పడ్డా.. తిట్టుకున్నా అందులోకి ఫ్యామిలీని లాగడం కరెక్ట్ కాదు. అలాగే తమ నాయకుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై కార్యకర్తలు, ఫ్యాన్స్ దాడులు చేయడమనేది హేయమైన చర్య. పవన్ తన ఫాన్స్ను అదుపులో పెట్టుకుని.. వారికి దిశానిర్దేశం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్ర పరిశ్రమలో అందరం అన్నదమ్ములుగా ఉంటాం. ప్రాణాలు తీసేవాళ్లు, ప్రాణాలకు తెగించేవాళ్లు ఫ్యాన్స్ కాదు. నిజమైన ఫ్యాన్స్ అంటే ఇతరులకు ప్రాణాలు పోసేవాళ్లు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు. తమ అభిమాన స్టార్లకు మరింత పేరు తెచ్చే విధంగా ప్రవర్తించే వాళ్లు.
ఓటు వేయకుంటే చంపేస్తారా?: నట్టి కుమార్
ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదంలో తెలంగాణ గడ్డకు సంబంధం లేదు. అయితే పోసానిని చంపేస్తామంటూ జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ బెదిరించినందు వల్ల ఆయనపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. రేపు ఓటు వేయకపోతే కూడా చంపేస్తామంటారేమో! ఇదంతా తెలంగాణ గడ్డపై జరుగుతున్నందు వల్ల ఆంధ్రా వాళ్లు భయం గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సి వస్తోంది. వీటిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. చిరంజీవి గారు కూడా సీరియస్గా తీసుకుని ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి. ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడేలా చిరంజీవి, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, విష్ణు తదితరులు చర్యలు తీసుకోవాలి. ఆన్ లైన్ టికెటింగ్ విధానం మంచిదే. దీంట్లో పారదర్శకత ఉంటుంది. కానీ నిర్వహణ ఎలా అయితే బాగుంటుందో అధ్యయనం చేశాక ప్రవేశ పెడితే బాగుంటుంది.