
వరల్డ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లో మహేష్ బాబు నటిస్తున్న ‘SSMB 29’ఒకటి. దర్శకుడు జక్కన్న చెక్కుతున్న ఈ అద్భుత ప్రయాణానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ పుట్టినరోజు సందర్భంగా.. SSMB29స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి కొద్దిగా ఆకలితీర్చాడు జక్కన్న. కానీ, మహేష్ ఫ్యాన్స్ మాత్రం, పూర్తి ఆకలి తీర్చే ఒక్కఅప్డేట్ కోసం మళ్ళీ వెయిటింగ్ మొదలెట్టారు.
లేటెస్ట్గా ‘SSMB29’కి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ బయటకొచ్చాయి. ఇటీవలి మీడియా సమావేశంలో, నిర్మాత కెఎల్ నారాయణ మూడో షెడ్యూల్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ మూడవ వారంలోపు తూర్పు ఆఫ్రికాలో కొత్త షెడ్యూల్ మొదలవ్వనుందని ధృవీకరించారు. కెన్యా రాజధాని నైరోబి మరియు టాంజానియాలోని అడవుల్లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను జక్కన్న చిత్రీకరిస్తారని వెల్లడించారు.
ప్రస్తుతం మహేష్ బాబు ఆయన సతీమణితో కలిసి ఎయిర్ పోర్ట్కి వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, మహేష్ టూర్కి వెళుతున్నారా? లేదా విదేశాల్లోనే SSMB29 క్యారెక్టర్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకోనున్నాడా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
మొదట్లో, జక్కన్న బృందం జూలైలో కెన్యాలో చిత్రీకరణ ప్రారంభించాలని భావించింది, కానీ దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న రాజకీయ అల్లర్ల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయినప్పటికీ, సెప్టెంబర్లో అక్కడ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు.
ALSO READ : కూలీలో విలన్గా ఎందుకు?
అయితే.. కెన్యాలో షూటింగ్ చేయాలనే ఆలోచనతో రాజమౌళి 2024లోనే అక్కడి లొకేషన్లను పరిశీలించినట్లు సమాచారం. దీంతో సినిమాలోని కొంత భాగాన్ని కెన్యాలో చిత్రీకరించాలని ముందునుంచీ ప్రణాళికలున్నాయి. అక్కడ సహజమైన, దట్టమైన అడవులు, అందమైన ప్రదేశాలు దర్శకుడిని ఆకట్టుకున్నాయి. సినిమా షూటింగ్కు తగిన ప్రదేశం అని భావించినట్లు సమాచారం. ఇక అక్కడి అల్లర్ల కారణంగా షూటింగ్కి బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే .. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కోసం, బిజీగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగి పోయారు డైరెక్టర్ జక్కన్న. అలాగే, హీరో మహేష్ బాబు కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద తీవ్ర కసరత్తులు మొదలు పెట్టాడు.
SSMB 29 గురించి:
రాజమౌళి తెరకెక్కిస్తున్న SMB29 మూవీ.. చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా సినిమా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రముఖ నివేదికలు కూడా చెప్పుకొచ్చాయి. అలా భారతీయ పురాణాలను సైన్స్ ఫిక్షన్తో మిళితం చేసి, కాశీ నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్.
ఇందులో ప్రియాంక చోప్రా సాహసోపేతమైన అన్వేషకురాలిగా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హైలీ టెక్నీకల్ వాల్యూస్ తెలిసిన విలన్గా నటించబోతున్నట్లు కూడా టాక్ ఉంది. ఇక చివరగా మహేష్ బాబు అసాధారణ శక్తి కలిగిన అన్వేషికుడిగా నటిస్తున్నాడట.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా, తెలియని భూబాగం నుంచి ప్రకృతి, రహస్య, శక్తివంతమైన శత్రువులతో అతను పోరాటం చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 'గ్లోబ్ ట్రోటర్' అనే క్యాప్షన్ కూడా పోస్టర్లో రాజమౌళి ప్రస్తావించాడని టాక్. ఏదేమైనా, నవంబర్లో వచ్చే అప్డేట్తో అన్నీ అంశాలకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో తమిళ నటుడు మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.