వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ‘ఆదికేశవ’. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు.
‘‘ ఇది కంప్లీట్ మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. యాక్షన్ సీన్స్ కథలో భాగంగానే ఉంటాయి. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పది మంది గాలిలో ఎగరడం లాంటివి ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి.
నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్గా ఉంటాయి. జోజు జార్జ్ గారు సెట్స్లో ఉన్నప్పుడు ‘ఉప్పెన’ టైమ్లో విజయ్ సేతుపతి గారిని చూసినట్లే అనిపించేది. అంత పెద్ద యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అయినప్పటికీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. రాధిక గారు సెట్స్లో అందరితో కలిసిపోతారు. ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పని చేయడం హ్యాపీ. మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఈ సినిమా చేయలేదు. కథ నచ్చి చేశాను.
ఎవరైనా అడిగినా కూడా నేను హీరోని కాదు, నటుడిని అనే చెబుతాను. పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో, నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం వస్తుందని చెప్పారు. అందుకే పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. ఈ తరానికి నచ్చేలా ఉండాలనుకుంటాను. ఇక నా మొదటి సినిమా ‘ఉప్పెన’కు నేషనల్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. అందరి కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనిపించింది. అలాగే బన్నీకి అవార్డ్ రావడం గర్వంగా ఉంది’’.