న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణల కేసులో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టాప్ రెజ్లర్లు దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ హర్యానా, పంజాబ్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 28న చేపట్టనున్న మహిళా మహాపంచాయత్కు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.
ఇప్పటికే బజ్రంగ్.. హర్యానాలోని జింద్కు చేరుకోగా, సాక్షి మాలిక్ ఆమె భర్త సత్యవర్త్ కడియాన్ పంజాబ్కు వెళ్లారు. కొత్త పార్లమెంట్ భవన్ ఓపెనింగ్కు ముందు అక్కడ భారీ ఎత్తున ధర్నా చేసేందుకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సంగీతా ఫోగట్ మాత్రం జంతర్ మంతర్ వద్ద దీక్ష కొనసాగిస్తున్నది.
ఖాప్ లీడర్లతో సమావేశం కోసం తమ సహచరులు నార్త్ ఇండియాలో పర్యటిస్తున్నారని తెలిపింది. బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో మహాపంచాయత్ను నిర్వహిస్తున్నామని రెజ్లర్లు స్పష్టం చేశారు.