సీపీఎస్​ను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

సీపీఎస్​ను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

కుంటాల, వెలుగు: ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న సీపీఎస్​ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని కోరుతూ కుంటాల ప్రభుత్వ స్కూళ్లలోని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్షన్​విద్రోహ దినంగా పాటించారు. సీపీఎస్​ను వెంటనే రద్దుచేయాలని తహసీల్దార్​ఎజాజ్​కు వినతిపత్రం అందజేశారు. మండల బాధ్యులు సతీశ్, నరేశ్, రాష్ట్ర నాయకులు గజేందర్, వెంకట్​రావ్, తిరుపతి గౌడ్, గంగాధర్, సోమేశ్, భోజన్న, సాహెబ్​రావు తదితరులు 
పాల్గొన్నారు.

కలెక్టర్​కు మెమోరాండం.. 

మంచిర్యాల: రాష్ట్రంలో సీపీఎస్ ​విధానాన్ని రద్దు చేసి ఓసీపీఎస్ విధానాన్ని పునరుద్ధరణకు టీయూటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, ప్రధాన కార్యదర్శి రవీందర్ ​డిమాండ్ ​చేశారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ ​బదావత్​సంతోష్​కు మెమోరాండం అందజేశారు. 2004 సెప్టెంబర్​1 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పెన్షన్​హక్కును కాలరాసేలా సీపీఎస్​ విధానం ఉందని, దీని వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పాత పెన్షన్​ స్కీమ్​ను అమలు చేయాలని అప్పటి వరకు పోరాటం ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్​నాయకులు పాల్గొన్నారు.  

జాక్టో ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం

నిర్మల్: సీపీఎస్​ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ జాక్టో ఆధ్వర్యంలో నిర్మల్​లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అన్ని స్కూళ్ల టీచర్లు భోజన విరామ సమయంలో నిరసన తెలిపి, సాయంత్రం అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్​కు మెమోరాండం సమర్పించారు. టీడబ్ల్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ రావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజేందర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.