ఆశతో వస్తున్రు.. నిరాశతో వెళ్లిపోతున్రు .. భద్రాద్రికొత్తగూడెంలో తూతూ మంత్రంగా ప్రజావాణి

ఆశతో వస్తున్రు.. నిరాశతో వెళ్లిపోతున్రు .. భద్రాద్రికొత్తగూడెంలో తూతూ మంత్రంగా  ప్రజావాణి
  • రెగ్యులర్​ ప్రోగ్రామ్స్​తో కలెక్టర్​ బిజీబిజీ
  • అడిషనల్​ కలెక్టర్లతోనే కొనసాగుతున్న గ్రీవెన్స్
  • సమయపాలన పాటించని ఆఫీసర్లు
  • ఇబ్బందుల్లో అర్జిదారులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో ప్రతీ సోమవారం నిర్వహించే  ప్రజావాణిపై  అర్జిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తమ సమస్యలు కలెక్టర్​కు చెప్పుకుందామని దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశతో కలెక్టరేట్​కు వస్తే ​పై ఆఫీసర్లు ఎవరూ అందుబాటులో లేక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తొలుత అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్​ అందుబాటులో ఉన్నా  తర్వాత ఇంపార్టెంట్​పనిపై ఆయన వెళ్లిపోవడంతో కిందస్థాయి ఆఫీసర్లే ఫిర్యాదులు స్వీకరించారు.  మరోవైపు గ్రీవెన్స్​కు రావాల్సిన అధికారులు ఇన్​టైంలో రావడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఇదీ పరిస్థితి.. 

కలెక్టరేట్​లో నిర్వహించే గ్రీవెన్స్​కు జిల్లా ఆఫీసర్లంతా సోమవారం ఉదయం 10గంటలకు అటెండ్​ కావాలి. కానీ, ఆ సమయానికి 10 మంది అధికారులు కూడా రాలేదు. దాదాపు 60కిపైగా ఆఫీసర్లు హాజరు కావాల్సి ఉంటే 10.30 గంటలకు  సగం మంది మాత్రమే అటెండ్​ అయ్యారు. గ్రీవెన్స్​ 10.55 గంటలకు మొదలు కాగా, 11 గంటల తర్వాత కూడా ఆఫీసర్లు ఫిర్యాదులు క్రమంగా స్వీకరించకుండా వచ్చిపోతున్నారని అర్జిదారులు వాపోయారు. కొందరు జిల్లా ఆఫీసర్లు కింది స్థాయి వారిని పంపిస్తూ డిపార్ట్​మెంట్​ తరఫున అటెండెన్స్​ రిజిస్టర్​లో సంతకం పెడుతుండగా, తీరిగ్గా జిల్లా ఆఫీసర్లు వచ్చి గ్రీవెన్స్​లో కూర్చుంటున్నారే ఆరోపణలు ఉన్నాయి.

పెరుగుతున్న నిర్లక్ష్యం! 

కలెక్టర్​ జిల్లాలోని ఆయా కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటూ అడపా దడపా గ్రీవెన్స్​ల్లో  పాల్గొంటున్నారు. అడిషనల్​ కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎక్కువగా గ్రీవెన్స్​లు కొనసాగుతున్నాయి. దీంతో కింద స్థాయి అధికారుల్లో నిర్లక్ష్యం పెరుగుతోందని, సమయపాలన పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అర్జిదారులు ఆరోపిస్తున్నారు.  ఈ సోమవారం అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​ గ్రీవెన్స్​ కొనసాగిస్తున్న టైంలో ఓ ఇంపార్టెంట్​ ప్రోగ్రాంతో  కొంత టైం ఆఫీస్​కు వెళ్లాల్సి వచ్చింది. 

దీంతో హౌసింగ్​ పీడీ తో పాటు ఆర్డీఓ గ్రీవెన్స్​ను కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 60 దరఖాస్తులు రాగా, వీటిలో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు ఉన్నాయి. వారిలో చాలా మంది కలెక్టర్​ను కలువలేకపోయామని, తమ సమస్య పరిష్కారం అవుతుందో.. లేదోననే అసంతృప్తితో వెనుదిరగడం కనిపించింది.