ఇవాళ్టి నుంచి రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

ఇవాళ్టి నుంచి రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
  • 23 వరకు ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు
  • హాజరు కానున్న మంత్రులు
  • నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రైతుభరోసా స్కీం గైడ్​లైన్స్​రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో వేసిన కేబినెట్​సబ్​కమిటీ ఈ నెల 10 నుంచి 23వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాలవారీగా రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు సహా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించబోతోంది. ఈ నెల 10న ఖమ్మం జిల్లాలో, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ సమావేశాలకు ఆయా వర్గాలను సమీకరించాల్సిన బాధ్యతను కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించింది. కేబినెట్​సబ్​కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల అధికారులతో కలిసి విధివిధానాలపై చర్చించారు. సాగులోలేని భూములకు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుభరోసా ఇవ్వొద్దని  ఓ నిర్ణయానికి వచ్చారు. 

అలాగే, ఒక రైతుకు ఐదు ఎకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలా? పది ఎకరాల వరకు ఇవ్వాలా?  అనే అంశంపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోయారు. రైతుబంధు పొందుతున్నవారిలో 83 శాతం మంది 5 ఎకరాల్లోపు రైతులేనని, దీంతో 5 ఎకరాలకు కటాఫ్​ పెడ్తే  మెజారిటీ రైతులు కవర్​అవుతారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, రైతులు, రైతుసంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఉప సంఘం భావించింది. ఈ క్రమంలోనే తాజాగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ప్రభుత్వం షెడ్యూల్​విడుదల చేసింది. ఇందులో జిల్లా మంత్రులతో పాటు, ఇన్​చార్జ్​ మంత్రులు పాల్గొననున్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్​ సర్కారు, వారి గుర్తింపునకూ విధివిధానాలు రూపొందించాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి కూడా తాజా సమావేశాల్లో అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలిసింది.