ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్​లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆదివారం నిర్మల్​లో మంత్రి పర్యటించారు.​ స్థానిక దివ్యనగర్​లో రూ. 10.10 లక్షలతో నిర్మించనున్న అయ్యప్ప మున్నూరుకాపు సంఘం, యోగా వశిష్ట సంఘటన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మరో రూ.10 లక్షల మంజూరుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త కలెక్టరేట్​భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు. అనంతరం చించోలి చౌరస్తా వద్ద అంబేద్కర్  కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం భూమిపూజ చేశారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఉత్సవాలకు హాజరయ్యారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు.

మాజీ మావోయిస్టు దంపతులను కలిసిన మంత్రి

అజ్ఞాత జీవితం గడిపి ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు ఒగ్గు సట్వాజీ దంపతులను మంత్రి పరామర్శించారు. వారితో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్​ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్​ఈశ్వర్   పాల్గొన్నారు.

27 గంటల ఉత్కంఠకు తెర

ఏసీపీ హామీతో టవర్ దిగిన పీఈటీ

బెల్లంపల్లి రూరల్,వెలుగు: కాసిపేట మండలం దేవాపూర్​ఓరియంట్ ​సిమెంట్​ కంపెనీ గేటు ఎదుట ఉన్న టవర్​ఎక్కిన పీఈటీ శ్రీనివాస్​ఆదివారం ఆందోళన విరమించారు. ఓరియంట్ ధ్యాన మందిర్​పాఠశాల యాజమాన్యం వేధింపులు మాని పెండింగ్​ వేతనాలు చెల్లించాలంటూ శనివారం ఆయన టవర్​ఎక్కిన  విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్​ఇచ్చిన హామీతో ఆయన శాంతించారు. సుమారు 27 గంటల ఉత్కంఠకు తెరపడింది. డిమాండ్లు పరిష్కరించే అధికారం ఇక్కడి అధికారులకు లేదని, మూడు రోజుల్లో చర్చించి సమస్య పరిష్కరిస్తామని, వేతనాలు ఇప్పిస్తానని, సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలకు వెళ్లాలని ఏసీపీ హామీ ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ, సీపీఐ నియోజకవర్గ ఇన్​చార్జి రేణికుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆదివాసీల భూములు లాక్కొని అన్యాయం చేశారని, ప్రస్తుతం ఉన్న సంఘం, యాజమాన్యం ఒక్కటై కార్మికులను వేధించడం బాధాకరమన్నారు. ఓరియంట్​కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం 
చేస్తామన్నారు. 

జనం మధ్యలో ‘గ్యాస్ ఫిల్లింగ్’

కాగజ్ నగర్,వెలుగు: కాగజ్​నగర్​ పట్టణంలో జనం మధ్య గ్యాస్​ ఫిల్లింగ్​ దందా కొనసాగుతోంది. స్థానిక మెయిన్​మార్కెట్​ఏరియాలో ఓ ఇంట్లో సిలిండర్లలో గ్యాస్​నింపుతూ  అత్యవసరమైన వాళ్లకు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు. గ్యాస్​ కంపెనీల నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు వ్యాపారులకు సిలిండర్లు సప్లై చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర సమయంలో గ్యాస్​కావాలనుకునేవారి నుంచి గ్యాస్​సిలిండర్​అసలు ధరకంటే మూడు నుంచి నాలుగు వందలు ఎక్కువ తీసుకుంటున్నారు. వివిధ గ్యాస్​ఏజెన్సీల సిలిండర్ల సప్లై సరిగా లేకపోవడంతో చాలామంది ‘ఫిల్లింగ్’ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతంలో రెండుసార్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కేసుదు నమోదు చేసినా దందా ఆగడంలేదు. ఇదంతా జనవాసాల మధ్య జరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

తరుణ్ చుగ్​ను కలిసిన రామారావు పటేల్

భైంసా,వెలుగు: డీసీసీ మాజీ అధ్యక్షుడు రామా రావు పటేల్​ఆదివారం హైదరాబాద్​లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్​ను కలిశారు. ఈ నెల 28న బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భైంసాలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో పార్టీలో చేరుతానని తరుణ్​చుగ్​తో పేర్కొన్నారు. సభ ఏర్పాట్లు చేయాలని తరుణ్ చుగ్, బండి సంజయ్ సూచించినట్లు రామారావు పటేల్​ తెలిపారు. ఆయన వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, న్యాయవాది అంజు కుమార్​ తదితరులున్నారు. 

యువత చైతన్యవంతులు కావాలి

భైంసా,వెలుగు: యువత చదువుతో పాటు అన్నిరంగాల్లో చైతన్యవంతులు కావాలని ఆర్కే ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు బాజీరావు బోస్లే ఆకాంక్షించారు. ఆదివారం భైంసా మండలం తిమ్మాపూర్​లో రెండో విడత యువ చైతన్య యాత్ర నిర్వహించారు. తిమ్మాపూర్ నుంచి పెంచికల్ పాడ్, విఠాపూర్, వెంకూర్ గ్రామాల వరకు బైక్​ర్యాలీ తీశారు. మిల్లర్లు ధాన్యం కొనేటప్పుడు మూడు కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత గ్రామాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసమస్యలపై పోరాడాలన్నారు. సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్​రామారావు, సంజీవ్​రావు, దత్తు, రంజిత్​ పాల్గొన్నారు.

ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్​ చేయండి

ఖానాపూర్/లక్ష్మణచాంద,వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ 28న భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తారని ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు తెలిపారు. ఆదివారం ఆయన ఖానాపూర్​లో యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. కార్యకర్తలు యాత్రను సక్సెస్​చేయాలని కోరారు. కార్యక్రమంలో రూట్​ఇన్​చార్జి ఉదయ్ బాబు మోహన్, పెంబి జడ్పీటీసీ జానుబాయి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్, లీడర్లు కిరణ్, రాజు, మల్లికార్జున్ రెడ్డి, సందుపట్ల శ్రావణ్, ఉపేందర్, సురేశ్, మోహన్, గిరి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణచాంద, మామడలో యాత్ర రూట్​మ్యాప్​ను యాత్ర ఇన్​చార్జి ఉదయ్ బాబు మోహన్ పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు డాక్టర్ ​మల్లి కార్జున్​రెడ్డి పాల్గొన్నారు.

టిప్పు సుల్తాన్​ జయంతి

భైంసా, వెలుగు: టిప్పు సుల్తాన్​ జయంతి సందర్భంగా ఆదివారం భైంసాలో హబీబ్–ఏ-–మిల్లత్  యూత్​అండ్ వెల్ఫేర్​ సొసైటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గవర్నమెంట్​కాలేజీ నుంచి టిప్పు సుల్తాన్​ చౌక్​ వరకు టిప్పు సుల్తాన్​ఫొటోతో ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఏఎస్పీ కిరణ్​ ఖారే ఆధ్వర్యంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఫయాజుల్లాఖాన్​, కౌన్సిలర్​అమీర్ అహ్మద్,​ సొసైటీ అధ్యక్షుడు ఎంఏ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.