హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పరీక్షలు వచ్చే సమయానికి ఫీజులు చెల్లించలేదంటూ విద్యార్థులను ఇంటికి పంపించడం లేదా? వారికి పనిష్ మెంట్ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు అవమానాలకు గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మంటేస్సోరి ప్రైవేట్ పాటశాలలో ఇలాంటి ఘటనే జరిగింది. 7వ తరగతి చదువుతున్న వితేష్ అనే విద్యార్థి పాఠశాల ఫీజు అలాగే పరీక్ష ఫీజు చెల్లించాడు. అయినా ఆ విద్యార్థిని పరీక్షలు రాయనివ్వకుండా పాఠశాల యాజమాన్యం ఎండలో నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల వద్దకు చేరుకుని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యాన్ని అడగగా ఇది అటెండర్ పోరాపాటు అని పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది.