
భారత భూభాగంలోనికి పాక్ డ్రోన్ ప్రవేశించింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భారత సరిహద్దును దాటి అక్కడే చక్కర్లు కొట్టింది. దీన్ని గమనించిన భారత జవాన్లు వెంటనే పై అధికారులకు సమాచారమందించారు.
పంజాబ్లోని ఫిరోజ్పూర్ హుస్సేనివాలా చెక్పోస్ట్ సమీపంలోని హెచ్కే టవర్ వద్ద ఈ డ్రోన్ను బీఎస్ఎఫ్ పసిగట్టింది. రాత్రి 10:00 నుంచి 10:40 మధ్య భారత్ భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ అక్కడే ఐదు సార్లు చక్కర్లు కొట్టినట్టు జవాన్లు గుర్తించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్కడి నుంచి మాయమవడంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మందులు, ఆయుధ సామాగ్రిని చేరవేసేందుకు పాక్కు చెందిన ఉగ్రవాద గ్రూపులు ఈ డ్రోన్ను ఉపయోగించాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్న పాక్ సైన్యం ఏదో ఓ రూపంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, సరిహద్దు లోకి అక్రమంగా ప్రవేశించడం.. ఇలా ఎన్నో రకాలుగా పాక్ నిబంధనలు అతిక్రమిస్తోంది. రెండు వారాల క్రితం సరిహద్దు వెంట ఆయుధాలు జారవిడించేందుకు ఉపయోగిస్తున్న రెండు డ్రోన్లను పంజాబ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై దర్యాప్తు చేపడుతోంది.