సెంట్రల్‌ జైలులో మొదటి సారిగా ఖైదీల కోసం ATM

సెంట్రల్‌ జైలులో మొదటి సారిగా ఖైదీల కోసం ATM

బీహార్‌లోని పూర్నియా సెంట్రల్‌ జైలులో మొట్టమొదటిసారి ఖైదీల కోసం అధికారులు ATM ను ఏర్పాటు చేశారు. ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును తీసుకోవడానికి జైలు ఏరియాలో ATM  ఏర్పాటు చేశారు. జైలు గేటు దగ్గర ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు డబ్బును డ్రా చేసుకునేందుకు జైలు లోపల ఏటీఎం ఏర్పాటు చేశామని పూర్నియా జైలు సూపరింటెండెంట్‌ జితేంద్రకుమార్‌ చెప్పారు. పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా, వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400 మందికి ATM కార్డులను జారీ చేశామని, మిగిలినవారికి కూడా ATM కార్డులను త్వరలో జారీ చేస్తామన్నారు బ్యాంకు అధికారులు.

జైలులోని ఖైదీలకు 4 నుంచి 8 గంటల పనికి రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల వరకు వేతనాన్ని చెల్లిస్తున్నారు. జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. జైలు మాన్యువల్‌ ప్రకారం ఒక్కో ఖైదీ 500 రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జైలు అధికారులు తెలిపారు.