న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఎడమ పాదం గాయంతో వరల్డ్ చాంపియన్షిప్కు దూరమైంది. దీంతో ఫ్యాన్స్ అందరూ కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే సింధుకు అయిన గాయం చిన్నదేనని, వచ్చే వారం ప్రాక్టీస్ మొదలుపెట్టే చాన్స్ ఉందని తెలుస్తోంది. పాదం ఎముకలో అయిన ఫ్రాక్చర్ పెద్ద తీవ్రమైంది కాదని సమాచారం. కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్స్ మ్యాచ్లో నొప్పితో బాధపడిన సింధు ఆ తర్వాత ఫ్రీగా నడవలేకపోయింది.
అయితే కొంత చికిత్స తర్వాత కాలికి బ్యాండేజ్ వేసుకుని మిగతా మ్యాచ్లను పూర్తి చేసింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకుంది. ‘గాయం చాలా చిన్నది. పెద్ద సీరియస్ కూడా కాదు. చూడటానికి మేజర్గా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. వచ్చే వారంలో రొటీన్ ట్రెయినింగ్ను మొదలుపెట్టొచ్చు. అయితే వరల్డ్ చాంపియన్షిప్కు వారంరోజులే టైమ్ ఉండటంతో రిస్క్ తీసుకోలేకపోయింది. నొప్పితో ఆడితే గాయం పెరిగే చాన్స్ కూడా ఉండటంతో వైదొలిగింది’ అని ప్లేయర్ వర్గాలు పేర్కొన్నాయి.